Bhogapuram Airport: ఆంధ్రప్రదేశ్ లో సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది. భోగాపురంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. అంతకుముందు దిల్లీ నుంచి విమానశ్రయంలో ల్యాండ్ అయిన ప్రధాని మోదీకి ఏపీ ప్రభుత్వం తరపున ఘన స్వాగతం పలికారు. మోదీ రాక నేపథ్యంలో అప్పటికే ఎయిర్ పోర్టుకు చేరుకున్న గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు, నారా లోకేశ్ ప్రధానికి గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు. అనంతరం అక్కడి టెర్మినల్ ను ప్రారంభించిన ప్రధాని.. ఎయిర్ పోర్టు ప్రత్యేకతల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎయిర్ పోర్టులో కల్పించిన అధునిక సౌకర్యాలను ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను ప్రధాని వీక్షించారు.
తొలుత విమానశ్రయ టెర్మినల్ ను పరిశీలిస్తున్న క్రమంలోనే అక్కడ ఏర్పాటు చేసిన అతిపెద్ద వీడియో వాల్ ను ప్రధాని వీక్షించారు. ఈ సందర్భంగా ఏపీలోని వివిధ పుణ్య క్షేత్రాలను ప్రధాని కోసం ప్రత్యేకంగా ప్రదర్శించారు. ప్రధాని ఆ దృశ్యాలను చూస్తున్న క్రమంలోనే ఆంధ్రప్రదేశ్, ఉత్తరాంధ్ర చారిత్రాక అంశాలను సీఎం చంద్రబాబు మోదీకి వివరించారు. అటు ఎయిర్ పోర్ట్ నమూనాను జీఎంఆర్ ప్రతినిధులు ప్రధానికి తెలియజేశారు. అనంతరం విమానాశ్రయంలో ఓపెన్ టాప్ జీపులో తిరుగుతూ.. ఎయిర్ పోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కళాకృతులు, సాంస్కృతిక ప్రదర్శనలు ప్రధాని వీక్షించారు.
Also Read: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. ఈసారి ఎంతంటే?
ఓపెన్ టాప్ జీపులో వెళ్తూనే 13,500 మంది గిరిజన మహిళల థింసా నృత్యాన్ని ప్రధాని వీక్షించడం విశేషం. ప్రధానితో పాటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సైతం జీపులో ప్రయాణిస్తూ.. సాంస్కృతిక కార్యక్రమాల ప్రాముఖ్యతను ప్రధానికి వివరించారు. అనంతరం ఓపెన్ టాప్ జీపు నుంచే నేతలు సభా వేధిక వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, పవన్ తో పాటు ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన భారీ జనసందోహం తమ హర్షధ్వానాలతో ప్రధానిని వేదికపైకి ఆహ్వానించాయి.
అనంతరం వేదికపైకి వచ్చిన ప్రధానిని ఏపీ స్టైల్లో సీఎం చంద్రబాబు సత్కరించారు. పొందూరు ఖాదీ శాలువాను కప్పి రాష్ట్ర ప్రభుత్వం తరపున గౌరవ మర్యాదలు తెలియజేశారు. అనంతరం డిప్యూటీ సీఎం పవన్, మంత్రి నారా లోకేశ్ తో కలిసి బొబ్బిలి వీణను మోదీకి చంద్రబాబు బహుకరించారు. ప్రస్తుతం వేదికపై ప్రధాని, చంద్రబాబు, పవన్, లోకేశ్ తో పాటు.. ఏపీ, గోవా గవర్నర్లు అబ్జుల్ నజీర్, అశోక్ గజపతి, కేంద్రం మంత్రులు రామ్మోహన్ నాయుడు, శ్రీనివాస వర్మ, పెమ్మసారి చంద్రశేఖర్ సహా రాష్ట్ర మంత్రులు ఆశీనులు అయ్యారు.
Also Read: ‘నా వయసు 15 ఏళ్లే.. నన్ను క్షమించండి’.. మోదీ విషయంలో యువతి యూటర్న్!