![](https://www.bigtvlive.com/wp-content/uploads/2023/07/Purandeswari-ARTICAL-IMAGE.jpg)
Purandeswari latest news(Andhra Pradesh political news today): ఏపీ రాజకీయాల్లో బీజేపీ వైఖరి ఇన్నాళ్లు ఒకలెక్క.. ఇకమీద మరో లెక్కా? పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టారు దగ్గుబాటి పురందేశ్వరి. ఏపీ బీజేపీ చీఫ్గా సోము వీర్రాజు నుంచి పగ్గాలు అందుకున్న ఆమె.. పార్టీ నేతలు, కార్యకర్తల సమావేశానికి ముందే మీడియా సమావేశం పెట్టారు. జగన్ ప్రభుత్వంపై ఘాటు ఆరోపణలు చేశారు. కేంద్రం నుంచి అందిన ప్రతి పైసా లెక్కలు వివరించిన పురందేశ్వరి.. రాష్ట్ర సర్కార్ చేసింది ఏముందంటూ ప్రశ్నించారు.
ఏపీలో రాజకీయం మారుతోందా? ఇప్పటివరకు టీడీపీ, జనసేన – వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. బీజేపీ చీఫ్గా సోము వీర్రాజు ఉన్నప్పుడు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. తాను అలా కాదంటూ తొలి ప్రెస్మీట్తో చెప్పకనే చెప్పారు పురందేశ్వరి.
ఏపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించడానికి ముందు పురందేశ్వరి హైదరాబాద్ లో ఎన్టీఆర్ ఘాట్ సందర్శించారు. తన తండ్రి సమాధి వద్ద పుష్పాంజలి ఘటించారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలుగా నియమిస్తూ బీజేపీ అధిష్టానం ఇచ్చిన పత్రాన్ని సమాధి వద్ద పెట్టి అంజలి ఘటించారు. ఆ తర్వాత హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లారు.
1980లో బీజేపీ ఆవిర్భావం తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 12 మంది రాష్ట్ర అధ్యక్షులుగా పని చేశారు. రాష్ట్ర విభజన తర్వాత కంభంపాటి హరిబాబు, కన్నా లక్ష్మీనారాయణ, సోము వీర్రాజు ఆ బాధ్యతలు చేపట్టారు. వాళ్లందరూ పురుషులే. తొలిసారిగా బీజేపీ అధిష్టానం ఓ మహిళ నేతకు ఏపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించడం విశేషం.