Rachamallu: కడప జిల్లా ప్రొద్దుటూరులో వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల వైఎస్ జగన్ నిర్వహించిన మీడియా సమావేశంపై స్పందిస్తూ.. జగన్ కేవలం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, టీడిపి మేనిఫెస్టో, ఉద్యోగులు, నిరుద్యోగుల సమస్యలపైనే మాట్లాడారని గుర్తుచేశారు. కానీ కొందరు పదే పదే గొడ్డలి పార్టీ అంటూ వివేకానందరెడ్డి హత్యను ప్రస్తావిస్తున్నారని మండిపడ్డారు.
జగన్ హింసవాది..
జగన్ హింసవాది అయితే ఐదేళ్ల పాలనలో ఎవరైనా చనిపోయేవారా అని ప్రశ్నించారు. రాజారెడ్డి కాలంలో పులివెందులలో భయం ఉంటే, వైఎస్సార్ హయాంలో అది పోయిందని, జగన్ వచ్చాక పూర్తి స్వేచ్ఛ వచ్చిందని పేర్కొన్నారు. గత జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడిపి దౌర్జన్యాలు చూశామని, తామే హింసవాదులమైతే ఎన్నికల్లో టీడీపీ ఎలా గెలిచేదని నిలదీశారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, రైతుల పరిస్థితులను పత్రికలు రాయవని ధ్వజమెత్తారు.
టీడీపీపై సంచలన వ్యాఖ్యలు
వైఎస్సార్ మానవతావాది అని, వ్యవసాయానికి ఉచిత విద్యుత్, డ్యామ్లు, ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ తెచ్చిన ఆయనను రాక్షసుడు అంటే ఆకాశంపై ఉమ్మివేసినట్టేనన్నారు. బాబుకు వాదించే లాయర్ లూత్రానే, ఐస్క్రీమ్ అమ్ముకునే దస్తగిరికి కూడా వాదిస్తున్నారంటే దీని వెనుక ఎవరున్నారో అర్థమవుతోందన్నారు. జగన్ 18 మెడికల్ కాలేజీలు, పెన్షన్లు లాంటి సంస్కరణలు తెచ్చారని, ఆయన శ్వాస ఉన్నంతవరకు హింసను ప్రేరేపించరన్నారు. శివారెడ్డి, ఎంవీ రమణారెడ్డి, వరదరాజుల రెడ్డి, దేవగుడి, కాటసాని బ్రదర్స్ ఫ్యాక్షనిస్టులు కారా? టీడీపీలో ఫ్యాక్షనిస్టులు లేరా అని ప్రశ్నించారు. నిజానికి 1988లో టీడీపీ పుట్టిన తర్వాతే ఫ్యాక్షనిజం ఎక్కువైందని, వైఎస్సార్, జగన్ వచ్చాకే అది తగ్గిందని చెప్పారు.
షర్మిళక్కా ఎక్కడున్నావ్?
ఇక వైఎస్ షర్మిలపై స్పందిస్తూ.. ‘షర్మిళక్కా ఎక్కడున్నావ్? ఆస్తులు, రక్తం పంచుకున్నావు కదా, బయటకు రావా? మేము ఏమీ పంచుకోకపోయినా జగన్ కోసం వచ్చాం’ అన్నారు. చంద్రబాబును వదలి జగన్ను విమర్శిస్తున్న షర్మిల.. టీడీపీ అనే పుట్టలో పాలు పోస్తున్నారని, కానీ అది కాలనాగు అని హెచ్చరించారు. ఈ నిజాలన్నీ విజయమ్మ షర్మిలకు చెప్పదా అని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రశ్నించారు.
Also Read: పెద్ద లీడర్లు తెలుసంటే ‘సో వాట్’? నిబంధనలు ఉల్లంఘిస్తే వదిలేదే లేదు.. పవన్ కళ్యాణ్ హెచ్చరిక