Pawan Kalyan: తూర్పుగోదావరి జిల్లా వెంకటనగరం వద్ద ఆంధ్రా పేపర్ మిల్స్ నుంచి వస్తున్న పారిశ్రామిక వ్యర్థాలు గోదావరి నదిలో కలుస్తున్న ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా పరిశీలించారు. దశాబ్దాలుగా నదిని పట్టిపీడిస్తున్న ఈ కాలుష్య సమస్యపై ఆయన తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. నదిలోకి విడుదలవుతున్న కలుషిత నీటి శాంపిల్స్ను సేకరించి, వాటిని పరీక్షల నిమిత్తం ల్యాబ్కు పంపించారు.
గలగలలు కాదు.. వెలవెల బోతున్నాయి!
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’ గేయంలోని లిరిక్స్ మార్చాల్సిన దుస్థితి వచ్చిందని ఆవేదన చెందారు. ‘గోదావరి, కృష్ణమ్మల గలగలలు’ అని పాడుకోవడం ఇప్పుడు గతమైపోయిందని, నదుల దుస్థితిని చూసి ఇప్పుడు ‘గోదావరి, కృష్ణమ్మ వెలవెల’ అని పాడుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని వ్యాఖ్యానించారు. నదిలో కలిసే కలుషిత నీటిని ఎవరు తాగినా ప్రాణాలు పోతాయని, అసలు ఈ నీటిలో ఎవరైనా పుణ్యస్నానాలు చేయగలరా అని ప్రశ్నించారు. వేదికలపై ఎప్పుడూ కులాలు, వర్గాల గురించి మాట్లాడటం కాదు, పర్యావరణంపై కనీస కామన్ సెన్స్ ఉండాలని హితవు పలికారు. అక్కడే ఉన్న మంత్రి కందుల దుర్గేశ్ను ఉద్దేశించి.. ‘మీరైనా ఈ సమస్యను పట్టించుకోవాలి కదా’ అని వ్యాఖ్యానించారు.
లీడర్లు తెలుసంటే.. ‘సో వాట్’?
రాజకీయ అండదండలు చూసుకుని పరిశ్రమలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ఊరుకునేది లేదని పవన్ కళ్యాణ్ గట్టిగా హెచ్చరించారు. ‘మాకు ఫలానా పెద్ద లీడర్లు తెలుసు అని పరిశ్రమల యాజమాన్యాలు చెబితే.. ‘సో వాట్?’ అని అడుగుతున్నా. రేపు పొద్దున కాలుష్యం భరించలేక ప్రజలు తిరగబడితే ఏం చేస్తారు?’ అని ప్రశ్నించారు. పరిశ్రమలతో తామేమీ నిరంతరం యుద్ధం చేయాల్సిన అవసరం లేదని, కానీ చట్టాన్ని మాత్రం కఠినంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. పరిశ్రమల నిర్వహణ, కాలుష్యంపై తనను ప్రశ్నించే వారితో తానే నేరుగా మాట్లాడి సరైన లాజిక్ చెప్తానని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటే ఎంతటి వారైనా సహించేది లేదని స్పష్టం చేశారు.
Also Read: డిజిటల్ అరెస్ట్ పేరుతో వృద్ధురాలికి టోకరా.. రూ. 24 కోట్లు స్వాహా!