AP Weather: ఆంధ్రప్రదేశ్ లో ఎండలు మండిపోతున్నాయి. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ అన్న తేడా లేకుండా అన్ని ప్రాంతాలపై భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. దీంతో ఏపీ ప్రజలు బయటకు రావాలంటేనే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు. మరి ముఖ్యంగా మధ్యాహ్నం వేళ అత్యవసరం అయితేనే బయటకు వస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు అందించింది. ఏకంగా ఐదు రోజులు వర్షాలు కురుస్తాయని ప్రకటించింది.
ఏపీలోని పలు ప్రాంతాల్లో మార్చి 17 నుంచి 22 తేదీల మధ్య ఉరుములతో కూడిన వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మార్చి 17 నుంచి రాయలసీమ, కోస్తా ఆంధ్రలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు ప్రారంభమవుతాయని చెప్పింది. రాయలసీమలోని నంద్యాల, కడప, తిరుపతి, చిత్తూరుతో పాటు కోస్తా ఆంధ్రాలోని విజయవాడ, వైజాగ్ సహా అనే ప్రాంతాల్లో వాన జల్లు పడతాయని తెలిపింది. ఎండలతో అల్లాడుతున్న ఆయా ప్రాంతాల ప్రజలకు ఈ వానలతో ఉపశమనం లభిస్తుందని అంచనా వేసింది.
మార్చి 17న మెుదలైన వర్షం మార్చి 22 నాటికి తగ్గుముఖం పడతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. కాబట్టి వర్షాలు పడే 5 రోజుల పాటు రైతులు కాస్త అప్రమత్తంగా ఉండాలని సూచించింది. గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. అకాల వర్షాలతో పంటలు దెబ్బతినవచ్చని హెచ్చరించింది. మరోవైపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం లేకపోలేదని వాతావరణ శాఖ అంచనా వేసింది. కాబట్టి ప్రజలు సైతం కాస్త జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేసింది.
Also Read: Xiaomi AC: హై క్లాస్ ఏఐ ఫీచర్లతో.. షావోమీ సరికొత్త ఏసీ.. మధ్యతరగతికి బెస్ట్ ఆప్షన్!
ఇది ఉంటే ఏపీలోని పలు ప్రాంతాల్లో వాతావరణ ఒక్కసారిగా చల్లబడినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో చలికాలం తరహాలో ఉదయం పెద్ద ఎత్తున మంచు కురిసినట్లు స్థానికులు చెబుతున్నారు. దీంతో రోడ్లు, రైల్వే వంతెనలు, బ్రిడ్జీలు పొగమంచుతో నిండిపోయాయని అంటున్నారు. ఫలితంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని పేర్కొంటున్నారు. మెుత్తంగా ఐదు రోజుల పాటు ఏపీలో వర్షాలు పడతాయన్న వార్తలతో రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: LPG Alternatives: గ్యాస్ సమస్య వేధిస్తుందా? ఈ స్మార్ట్ పరికరాలతో.. నచ్చింది తినేయచ్చు!