Lal Darwaza Bonalu 2026 updates : భాగ్యనగరంలో ఆషాఢ మాస బోనాల సంబరాలు అత్యంత కన్నల పండగగా కొనసాగుతున్నాయి. చారిత్రక ప్రాశస్త్యం కలిగిన ఓల్డ్ సిటీలోని లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. ఈ పవిత్ర వేడుకల్లో భాగంగా ప్రభుత్వం తరఫున ప్రముఖులు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ ఆలయానికి విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ అమ్మవారికి ‘బంగారు బోనం’ సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
ఈ వేడుకల్లో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు.. రాష్ట్ర ప్రజలందరిపై సింహవాహిని అమ్మవారి చల్లని ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని, సకాలంలో వర్షాలు కురిసి రాష్ట్రం అన్ని రంగాల్లో సుభిక్షంగా వర్ధిల్లుతుందని ఆయన ఆకాంక్షించారు. అంతే కాకుండ ఈ ఏడాది బోనాల పండగ నిర్వహణ కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూ. 20 కోట్లు కేటాయించిందని, ఆషాఢ మాసం బోనాలను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రస్తుత కాలంలో ఎల్ నీనో ప్రభావం నుంచి రాష్ట్రాన్ని, రైతన్నలను కాపాడాలని అమ్మవారిని ప్రత్యేకంగా వేడుకున్నట్లు ఆయన వెల్లడించారు.
దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో.. అన్ని రకాల ఏర్పాట్లను చేసి బోనాల పండగను నిర్వహిస్తున్నామని అధికారులు తెలిపారు. రాబోయే రోజుల్లో.. సింహవాహిని అమ్మవారి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయడానికి తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడంతో జాతర ప్రశాంతంగా, ఆనందకర వాతావరణంలో జరుగుతోంది. ఇదిలా ఉంటే.. అమ్మవారి నామస్మరణతో పాతబస్తీ ప్రాంతం మొత్తం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.