RK Roja: చిత్తూరు జిల్లా పుత్తూరులో మాజీ మంత్రి ఆర్కే రోజా కూటమి ప్రభుత్వంపై విమర్శల దాడికి దిగారు. పుత్తూరు మున్సిపాలిటీలో ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనులన్నీ వైఎస్సార్సీపీ హయాంలో జరిగినవేనని, తాము అధికారంలో ఉన్నప్పుడు 99 శాతం పనులను పూర్తి చేశామని ఆమె స్పష్టం చేశారు. 35-40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే సీనియర్ నాయకులు పుత్తూరుకు చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. కరోనా వంటి కష్టకాలంలో కూడా ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ఎన్నో కీలకమైన పనులు చేశామని ఆమె గుర్తుచేశారు.
జగనన్న పాలనలో పుత్తూరు రూపురేఖలు మార్చామని రోజా వివరించారు. ముఖ్యంగా ప్రజల ఆరోగ్యం కోసం మూడు ఏళ్లలోనే నాలుగు అర్బన్ హెల్త్ సెంటర్లను నిర్మించడమే కాకుండా, స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిని అత్యాధునిక హంగులతో ఆధునీకరించామని తెలిపారు. ముస్లిం సోదరుల కోసం అద్భుతమైన షాదీమహల్ నిర్మించామని, అది పూర్తయినా ప్రస్తుత ప్రభుత్వం దానిని ప్రారంభించకుండా నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. గతంలో టీడీపీ నాయకులు ప్రభుత్వ ఆసుపత్రి నిధులపై కుట్రలు చేసి అడ్డుకున్నారని, కానీ తాము వాటిని అధిగమించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చామని పేర్కొన్నారు.
కూటమి నాయకుల తీరుపై రోజా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే గాలి భానుకు ఫేస్ వాల్యూ లేదని, అందుకే పోలీసులను, మున్సిపల్ అధికారులను అడ్డం పెట్టుకుని బెదిరింపు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. జనసేన నాయకులు దిగజారి మాట్లాడుతున్నారని, వారిని చూస్తుంటే అది జనసేన కాదు ‘కామసేన’లా కనిపిస్తోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవిత్రమైన తిరుమలను కూడా అపవిత్రం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పుట్టా సుధాకర్ కుమారుడు డ్రగ్స్ వ్యవహారంలో దొరకడం, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు రాసలీలల వీడియోలు బయటపడటం సిగ్గుచేటని అన్నారు. ఉగాది వంటి పర్వదినాన చైర్మన్ కొండపై ఉండాల్సింది పోయి ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు.
చంద్రబాబు నాయుడు ఉగాది రోజు కూడా అబద్ధాలు చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారని రోజా ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పడం హాస్యాస్పదమని, నేడు పెన్షన్లు, రేషన్ కార్డుల కోసం ప్రజలు గంటల తరబడి క్యూలలో నిలబడాల్సిన దుస్థితి వచ్చిందని మండిపడ్డారు. మహిళలకు సున్నా వడ్డీ రుణాలు ఇవ్వకుండా కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తోందని విమర్శించారు. రేణిగుంట నుండి పుత్తూరు వరకు జాతీయ రహదారి పనుల కోసం తాము ఢిల్లీ స్థాయిలో పోరాటం చేశామని, నగరి వరకు రద్దయిన రోడ్డు టెండర్లను కూడా తామే పూర్తి చేశామని స్పష్టం చేశారు. శ్రీవెంకటేశ్వర స్వామి అందరి లెక్కలు తేలుస్తారని, కూటమి నాయకుల పాపాలు పండుతాయని ఆమె హెచ్చరించారు.