Roja Warning to Chandrababu: వైఎస్సార్సీపీ ఫైర్బ్రాండ్, మాజీ మంత్రి ఆర్కే రోజా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణపై నిప్పులు చెరిగారు. జర్నలిజం ముసుగులో రాధాకృష్ణ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఒక బ్రోకర్లా వ్యవహరిస్తూ వేల కోట్లు గడించారని ఆమె తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ నేతల కుటుంబ సభ్యులను, మహిళలను లక్ష్యంగా చేసుకుని ఆంధ్రజ్యోతి పత్రికలో తప్పుడు రాతలు రాస్తే ఊరుకోబోమని, అవసరమైతే ఆ పత్రిక కార్యాలయాలను తగలబెడతామని ఆమె సంచలన హెచ్చరికలు జారీ చేశారు. తాము సంస్కారంతో మౌనంగా ఉంటున్నామని, ఒకవేళ తాము నోరు తెరిస్తే చంద్రబాబు, పవన్ కల్యాణ్.. ప్రస్తుత మంత్రులు రాష్ట్రంలో రోడ్లపై తిరగలేరని ఆమె స్పష్టం చేశారు.
రాధాకృష్ణ వ్యాఖ్యలకు నిరసనగా తిరుపతి నగరంలో వైఎస్సార్సీపీ నేతలు భారీ ఎత్తున ఆందోళన చేపట్టారు. మాజీ మంత్రి ఆర్కే రోజా.. మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. నిరసనకారులు ఆంధ్రజ్యోతి పత్రికా ప్రతులను రోడ్డుపై వేసి దహనం చేశారు. ఈ క్రమంలో అడ్డుకోవడానికి ప్రయత్నించిన పోలీసులకు, వైఎస్సార్సీపీ శ్రేణులకు మధ్య తోపులాట జరిగి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
ఈ సందర్భంగా రోజా కేవలం రాధాకృష్ణపైనే కాకుండా చంద్రబాబు ప్రభుత్వంపై కూడా విమర్శనాస్త్రాలు సంధించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాయలసీమ ప్రాంతానికి మరోసారి వెన్నుపోటు పొడిచారని ఆమె ఆరోపించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేయడానికి రూ. 2 వేల కోట్లు ఖర్చు చేయడానికి వెనుకాడుతున్న ప్రభుత్వం, అమరావతి కోసం రూ. 2 లక్షల కోట్లు ఎలా ఖర్చు చేస్తోందని ఆమె ప్రశ్నించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో చంద్రబాబు చీకటి ఒప్పందం చేసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని ఆమె విమర్శించారు.
గత ప్రభుత్వ హయాంలో 87 శాతం పనులు పూర్తయిన రాయలసీమ ప్రాజెక్టును నిలిపివేయడం ఈ ప్రాంత ప్రజల గొంతు కోయడమేనని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టును పూర్తి చేయించుకోవడానికి రాయలసీమ ప్రజలు ‘మహా ఉద్యమం’ చేపట్టాలని ఆమె పిలుపునిచ్చారు.
Read Also: సామాన్యుడికి సైతం పోలీసుల ప్రోటోకాల్.. వలిగొండలో అరుదైన ఘటన!