మాజీ మంత్రి రోజా తిరుపతి పర్యటనలో తమిళనాడు రాజకీయ పరిణామాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శనివారం తాతయ్యగుంట గంగమ్మను దర్శించుకున్న ఆమె జాతర పురస్కరించుకుని అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తమిళ వెట్రి కజగం (టీవీకే) అధినేత విజయ్ ప్రస్తుత రాజకీయ ప్రస్థానానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మధ్య ఉన్న పోలికలను విశ్లేషించారు. విజయ్ తన రాజకీయ ప్రయాణంలో ప్రతి అడుగులోనూ జగన్ను అనుసరిస్తున్నారని ఆమె పేర్కొన్నారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో వైసీపీ శ్రేణులు చేస్తున్న వాదనలకు రోజా గొంతు కలిపారు. ఏపీలో జగన్ ఏ విధంగానైతే ఒంటరిగా పోరాడి విజయం సాధించారో అలాగే తమిళనాడులో విజయ్ సైతం ఎవరితోనూ పొత్తులు లేకుండా సింగిల్గా బరిలోకి దిగి సత్తా చాటారని కొనియాడారు. ప్రజల ఆశీస్సులు విజయ్కు మెండుగా ఉన్నాయని ఆమె తెలిపారు. ముఖ్యంగా విజయ్ ప్రచార శైలిపై ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు.
ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ బహిరంగంగా జగన్తో కలిసి ఉన్న ఫోటోను ప్రదర్శించడాన్ని రోజా గుర్తు చేశారు. ఒక ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉండి పక్క రాష్ట్ర నాయకుడి ఫోటో చూపించాల్సిన అవసరం సాధారణంగా ఉండదని ఆమె అన్నారు. అయితే జగన్ లాంటి పాలన నాయకత్వం అందిస్తానని చెప్పడానికే విజయ్ అలా చేశారని రోజా అభిప్రాయపడ్డారు. డ్రెస్సింగ్ విషయంలోనూ విజయ్ జగన్ను కాపీ చేస్తున్నారని ఆమె స్పష్టం చేశారు.
డ్రెస్ కోడ్ మాత్రమే కాకుండా బహిరంగ సభలలో విజయ్ మాట్లాడే తీరు చూస్తుంటే జగన్ శైలి స్పష్టంగా కనిపిస్తోందని రోజా అన్నారు. తమిళనాడు ప్రజలు విజయ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని ఆమె చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో గవర్నర్ సానుకూలంగా స్పందించి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించాలని కోరారు. అసెంబ్లీలో బల నిరూపణకు విజయ్కు ఛాన్స్ ఇస్తే బాగుంటుందని ఆమె సూచించారు.
ఏపీ రాజకీయాలపైనా స్పందిస్తూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలే అసలైన కొలమానం అని రోజా అన్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీ బలం ఏంటో అందరికీ అర్థమవుతుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు ఇప్పటికీ జగన్ వైపే ఉన్నారని క్షేత్రస్థాయిలో పరిస్థితి తమకు అనుకూలంగా ఉందని ఆమె వివరించారు. గంగమ్మ తల్లి ఆశీస్సులతో వైసీపీ మళ్ళీ పూర్వవైభవం సాధిస్తుందని ఆమె ఆకాంక్షించారు.
ALSO READ: వీధి కుక్కల రూ.కోట్లు సంపాదించారు.. బ్లడ్ దందాలో సంచలన విషయాలు, పెట్ హాస్పిటల్ సీజ్