Saikrishna lock-up death case: ఏపీలో సంచలనం రేపిన రౌడీషీటర్ సాయికృష్ణ లాకప్ డెత్ కేసు దర్యాప్తు వేగంగా సాగుతోంది. ప్రధాన నిందితుడు అరెస్టు కావడంతో మిగతా వారిపై ఫోకస్ చేసింది సిట్. ఈ నేపథ్యంలో కృష్ణలంక పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ బాబురావును అరెస్ట్ చేశారు అధికారులు. ఇంకా ఎంతమంది పోలీసులు ప్రమేయం ఉందనేది ఆసక్తికరంగా మారింది.
విజయవాడ సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో దర్యాప్తు స్పీడ్
ఏపీలో సంచలనంగా మారిన రౌడీషీటర్ సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో దర్యాప్తు మరింత ముమ్మరం చేసింది సిట్. ఈ కేసులో ఇప్పటికే సస్పెండ్ సీఐ నాగరాజును అరెస్ట్ చేశారు. ఆపై రిమాండ్కు తరలించారు. ఇదిలాఉండగా కృష్ణలంక పోలీస్ స్టేషన్కు చెందిన క్రైమ్ కానిస్టేబుల్ బాబురావును అరెస్ట్ చేశారు సిట్ అధికారులు.
పోలీసుల థర్డ్ డిగ్రీ వల్లే సాయికృష్ణ ప్రాణాలు కోల్పోయినట్టు ఆరోపణలు నిజమని తేలడంతో అదుపులోకి తీసుకున్నారు. కానిస్టేబుల్ను సిట్ అధికారులు విచారించారు. ఆ తర్వాత న్యాయస్థానంలో హాజరు పరిచారు. కేసులో మరిన్ని వివరాలు రాబట్టేందుకు కస్టడీకి కోరే అవకాశం ఉంది. లాకప్లో సాయికృష్ణపై జరిగిన థర్డ్ డిగ్రీ జరగడం వెనుక బాబురావు కీలక పాత్ర పోషించినట్లు గట్టి ఆధారాలు సేకరించింది సిట్.
కానిస్టేబుల్ బాబురావుని అరెస్ట్ చేసిన అధికారులు, మరో కొందరు కూడా
సాయికృష్ణను విచక్షణారహితంగా కొట్టడంతో మరణించాడని సిట్ నిర్ధారణకు వచ్చింది. మరోవైపు సాయికృష్ణ మిస్సింగ్ కేసు పిటిషన్పై సోమవారం హైకోర్టులో విచారణ జరగనుంది. తన కొడుకు కనిపించడం లేదని సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సాయికృష్ణను కోర్టులో హాజరుపరచాలని గతంలో పోలీసులను ఆదేశించిన విషయం తెల్సిందే.
ఈలోగా ప్రభుత్వం సిట్ వేయడంతో దర్యాప్తులో పోలీసులు సాయికృష్ణను కొట్టి చంపిన విషయం బయటపడింది. అప్పటివరకు మిస్సింగ్ కేసుగా ఉన్న ఈ కేసు లాకప్ డెత్గా మారింది. మరోవైపు ఈ కేసులో మరికొందరు అరెస్టు కావచ్చనే సంకేతాలు బలంగా వినిపిస్తున్నారు. ఒకరు లేదా ఇద్దరు పోలీసులు ఉండే అవకాశముందని వార్తలు వస్తున్నాయి.
ALSO READ: అక్కడ వచ్చింది గొడ్డలి ఫ్యాక్టరీలే.. జగన్ ప్రభుత్వ వైఫల్యాలపై భూమిరెడ్డి హాట్ కామెంట్స్!