Sajjala Ramakrishna Reddy Comments:
రాజకీయ కక్షతో దాడులకు తెగబడుతున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. వైసీపీకి ఓట్లు పడతాయనుకున్న చోట్లా టీడీపీ శ్రేణులు దాడులకు దిగాయన్నారు. అయినా వైసీపీ నేతలు సంయమనం పాటిస్తున్నారన్నారు. బడుగు, బలహీన వర్గాలపైనే దాడులు జరుగుతున్నాయన్నారు. శాంతిభద్రతలు కాపాడాల్సిన పోలీసులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
ఎన్నికల కమిషన్ ఉదాసీనతగా వ్యవహరించిందని ఆయన అన్నారు. టీడీపీ దాడులు చేస్తున్నా పోలీసులు పట్టించుకోలేదని ఆయన అన్నారు. అసాంఘిక శక్తులు రాజకీయ కక్షతో హింసాకాండను కొనసాగిస్తున్నాయని ఆయన అన్నారు. పోలింగ్ సజావుగా జరగకూడదని టీడీపీ దాడులు చేసిందన్నారు. ఈ దాడులపై రాష్ట్ర డీజీపీకి, ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశామని ఆయన తెలిపారు.
కూటమి నేతలు చెప్పిన చోటా పోలీస్ అధికారులను మార్చారని, అయితే.. ఈసీ నియమించిన ఆ పోలీస్ అధికారులకు రాష్ట్రంపై అవగాహన లేదన్నారు. రాష్ట్రంలో పోలింగ్ కు ముందే ఉన్నతాధికారులను మార్చారని.. ఎక్కడైతే వారిని మార్చారో అక్కడే హింస జరిగిందని ఆయన ఆరోపించారు. పోలింగ్ రోజు వైసీపీ అభ్యర్థులను హౌస్ అరెస్ట్ చేశారు కానీ, టీడీపీ అభ్యర్థులను మాత్రం యథేచ్చగా వదిలేశారన్నారు. గురజాలలోని ఓ గుడిలో తలదాచుకున్న దళితులపై దాడులు చేశారన్నారు. అదేవిధంగా పల్నాడులో ఈసీ వైఫల్యం కారణంగానే గొడవలు జరిగాయన్నారు. వాటన్నిటికీ ఈసీనే బాధ్యత తీసుకోవాలని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
Also Read: పక్కా ప్లాన్ ప్రకారమే దారుణాలకు పాల్పడ్డారు: పేర్ని నాని
పల్నాడు, ప్రకాశం, తాడిపత్రి, తిరుపతిలలో అధికారులను మార్చారని, అక్కడనే ఎక్కువ హింస చెలరేగిందని సజ్జల ఆరోపించారు. మంత్రి అంబటి రాంబాబును అన్యాయంగా హౌస్ అరెస్ట్ చేశారన్నారు. ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి కుటుంబంపై దాడులు చేసినా పోలీసులు పట్టించుకోలేదన్నారు. ఈసీ వెంటనే స్పందించి రాష్ట్రంలో శాంతిభద్రతలను పరిరక్షించాలన్నారు. అదేవిధంగా కౌంటింగ్ సందర్భంగా కూడా అల్లర్లు చేసేందుకు టీడీపీ కుట్రలు పన్నుతోందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో రెండోసారి కూడా జగన్ పాలనే రాబోతుందని ఆయన పేర్కొన్నారు.