Sandeep Chakravarthy: జమ్మూ కాశ్మీర్లో సంచలనం సృష్టించిన భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేయడంలో ఒక తెలుగు అధికారి కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం శ్రీనగర్ ఎస్ఎస్పి (Srinagar SSP) గా బాధ్యతలు నిర్వహిస్తున్న కర్నూలుకు చెందిన సందీప్ చక్రవర్తి, ఈ కేసును ఛేదించడంలో ముందుండి నడిపించారు. పెహల్గాం దాడి తర్వాత చేపట్టిన “ఆపరేషన్ మహదేవ్ (Operation Mahadev)”లోనూ చురుకైన పాత్ర పోషించిన సందీప్ చక్రవర్తి, తాజా కుట్రను పసిగట్టడంలో అప్రమత్తంగా వ్యవహరించారు.
కేసు దర్యాప్తులో భాగంగా, జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన పోస్టర్లను సందీప్ చక్రవర్తి బృందం మొదట గుర్తించింది. వెంటనే రంగంలోకి దిగి, సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా పోస్టర్లు అంటించిన వారిని గుర్తించారు. పట్టుబడిన ముగ్గురు నిందితులకు గతంలో స్టోన్ పెల్టింగ్ కేసులు ఉన్నట్లు తేలింది. వీరిలో సోఫియాన్, ఇర్ఫాన్ అహ్మద్లను అదుపులోకి తీసుకున్న సందీప్ చక్రవర్తి బృందం, వారిని రెండు వారాల పాటు లోతుగా విచారించింది.
ఈ విచారణలోనే సంచలనాత్మక “డాక్టర్ల టెర్రర్ ప్లాట్ (Doctors Terror Module)” గురించిన కీలక సమాచారం బయటికి వచ్చింది. నిందితులు ఇచ్చిన సమాచారంతో దర్యాప్తు బృందాలు ఫరీదాబాద్లో తనిఖీలు చేపట్టాయి. ఈ తనిఖీల్లో జమ్మూ కాశ్మీర్ పోలీసులు దిగ్భ్రాంతికి గురయ్యారు. అక్కడ ఏకంగా 358 కిలోల పేలుడు పదార్థాలు, 2563 కిలోల ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. గత రెండు సంవత్సరాలుగా ఉగ్రవాదులు ఈ మెటీరియల్ను సమకూర్చినట్లు దర్యాప్తులో తేలింది.
ఈ “డాక్టర్స్ టెర్రర్ మాడ్యుల్” కేసుకు సంబంధించి ఇప్పటివరకు అరెస్టయిన వారి సంఖ్య తొమ్మిదికి చేరింది. ఒక చిన్న పోస్టర్ను ఆధారం చేసుకుని, ఇంత పెద్ద ఉగ్ర కుట్రను వెలికితీయడంలో ఎస్ఎస్పి సందీప్ చక్రవర్తి చూపిన చాకచక్యం సర్వత్రా ప్రశంసలు అందుకుంటోంది.