Menstrual Leave: కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పనిచేస్తున్న మహిళలకు పీరియడ్స్ సెలవులు ప్రకటించింది. 18 నుంచి 52 సంవత్సరాల వయస్సు గల మహిళలకు ఇకపై ప్రతి నెలా ఒక రోజు వేతనంతో కూడిన పీరియడ్స్ సెలవు పొందుతారు. కర్ణాటక ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన ఈ నూతన విధానం ప్రకారం.. మహిళలు నెలవారీ సమయంలో విశ్రాంతి తీసుకోవడానికి వేతనంతో సెలవులు మంజూరు చేయనున్నారు.
పర్మినెంట్, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఈ విధానం వర్తిస్తుందని ప్రభుత్వం పేర్కొంది. కంపెనీలు సంవత్సరానికి 12 రోజులు వేతనంతో కూడిన పీరియడ్స్ సెలవులు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఈ మేరకు నవంబర్ 12న ఉత్తర్వులు జారీ చేసింది. ఫ్యాక్టరీల చట్టంతో సహా వివిధ కార్మిక చట్టాలు అమల్లో ఉన్న పని ప్రదేశాలలో ఈ సెలవులు వర్తించనున్నాయి.
ఈ విధానానికి కర్ణాటక మంత్రివర్గం ఇటీవల ఆమోదం తెలిపింది. దుకాణాలు, వాణిజ్య సంస్థలు, ఐటీ, ఐటీ ఆధారిత సేవలు సంస్థలలో పనిచేసే మహిళలకు ఈ విధానం అమలు చేయనున్నారు. ఉద్యోగాలు చేస్తున్న మహిళల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కొన్ని రాష్ట్రాలు నెలవారీ సెలవులను ప్రకటిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలలో తాజాగా కర్ణాటక కూడా చేసింది. దీంతో 18 నుండి 52 సంవత్సరాల వయస్సు గల మహిళలు నెలలో ఒక రోజు పీరియడ్స్ సెలవులను పొందుతారు.
బెంగళూరులోని క్రైస్ట్ వర్సిటీకి చెందిన డాక్టర్ సప్నా ఎస్ నేతృత్వంలోని 18 మంది సభ్యుల కమిటీ ఈ విధానాన్ని రూపొందించింది. ముందుగా కమిటీ సంవత్సరానికి ఆరు పీరియడ్స్ సెలవులను సిఫార్సు చేసింది. తరువాత కార్మిక శాఖ దానిని 12 రోజులకు పెంచింది. తుది ప్రతిపాదనను ఇటీవల రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
Also Read: Solar Plants: మహిళలకు గుడ్ న్యూస్.. ఏడాదికి రూ.20 లక్షలు సంపాదించే ఛాన్స్, ఏం చేయాలంటే?
రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, మహిళా ఉద్యోగులు పీరియడ్స్ సెలవును అదే నెలలో ఉపయోగించుకోవాలి. సెలవును తదుపరి నెలకు బదిలీ చేయడం కుదరదని ఉత్తర్వుల్లో పేర్కొంది. సెలవు తీసుకునేందుకు ఎలాంటి మెడికల్ రిపోర్ట్ సమర్పించాల్సిన అవసరం లేదు. ఈ విధానం ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు కూడా వర్తిస్తుంది. ఇప్పటి వరకూ ఒడిశా, బిహార్ లలో ప్రభుత్వ ఉద్యోగులకు పీరియడ్స్ సెలవులు ఇస్తున్నారు.