Sankranti Cockfight: సంక్రాంతి అంటే కేవలం పండుగ మాత్రమే కాదు.. అది ఒక పౌరుషాల జాతర. ఈ సంక్రాంతిని పురస్కరించుకుని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా పందెం బరులు అత్యంత వైభవంగా ముస్తాబవుతున్నాయి. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లోని ప్రధాన కేంద్రాలు ఇప్పుడు మినీ స్టేడియాలను తలపిస్తున్నాయి.
ఈసారి తాడేపల్లిగూడెంలో పైబోయిన వెంకట్రామయ్య ఏర్పాటు చేస్తున్న బరి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఇక్కడ ఏకంగా కోటి రూపాయల కోడిపందెం జరగనున్నట్లు ప్రచారం జరుగుతుండటంతో పందెం రాయుళ్లలో ఉత్సాహం ఉరకలేస్తోంది. సాధారణ పందెం బరులు కాకుండా, విదేశీ క్రీడా మైదానాలను తలపించేలా గ్యాలరీలు, ఫ్లడ్ లైట్లు, మినీ స్టేడియం తరహా సెట్టింగులతో నిర్వాహకులు బరులను ముస్తాబు చేస్తున్నారు.
సంక్రాంతి పందాలను చూడటానికి విదేశాల నుండి, పొరుగు రాష్ట్రాల నుండి భారీగా తరలివచ్చే వివీఐపీల కోసం నిర్వాహకులు రాజభోగాలను సిద్ధం చేస్తున్నారు. పందెం రాయుళ్ల సౌకర్యార్థం నిర్వాహకులు ఎక్కడా తగ్గడం లేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి బరుల వద్ద అత్యాధునిక సౌకర్యాలు కల్పిస్తున్నారు.
ఏలూరు జిల్లాలో దుగ్గిరాల, ఉంగుటూరు, జంగారెడ్డిగూడెం, పోలవరం వంటి ప్రాంతాల్లో భారీ బరులు సిద్ధమయ్యాయి. ఇక పశ్చిమగోదావరి జిల్లాలో గొల్లవానితిప్ప, పెదమీరం, మహాదేవపట్నం, సీసలి, పూలపల్లి, నర్సాపురం, తణుకు ప్రాంతాలు పందాలకు ముస్తాబవుతున్నాయి. పందాలను తిలకించేందుకు దేశవిదేశాల నుండి వచ్చే పారిశ్రామికవేత్తలు, రాజకీయ ప్రముఖుల కోసం నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.పందెం బరుల వద్దే విశ్రాంతి తీసుకోవడానికి వీలుగా విలాసవంతమైన క్యారవాన్లను సిద్ధం చేశారు. కోడిపందాల కోసం వచ్చే వారు..ఇప్పటికే భీమవరం, పాలకొల్లు, తాడేపల్లిగూడెం పరిసరాల్లోని హోటళ్లు, లాడ్జిలు బుక్ చేసుకున్నారు. ఒక్కో గదికి మూడు రోజులకు గానూ భారీ ధరలు పలుకుతున్నా పందెం రాయుళ్లు వెనకాడటం లేదు.
గత ఏడాది వందల కోట్ల రూపాయలు చేతులు మారగా, ఈ ఏడాది ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. కేవలం కోడిపందాలే కాకుండా, బరుల చుట్టూ నిర్వహించే గుండాట, పేకాట వంటి జూద క్రీడల నిర్వహణ హక్కుల కోసం నిర్వాహకులు భారీ ఎత్తున వేలం పాటలు పాడుకుంటున్నారు. రాజకీయ, పోలీస్ యంత్రాంగం నుండి మౌఖిక మద్దతు లభిస్తుండటంతో, ఎక్కడా ఆటంకాలు లేకుండా పందాలు సాగేలా ఏర్పాట్లు సాగుతున్నాయి. మినీ స్టేడియాల తరహాలో ఫ్లడ్ లైట్లు, గ్యాలరీలు ఏర్పాటు చేసి, పందెం రాయుళ్లకు సరికొత్త అనుభూతిని ఇచ్చేందుకు నిర్వాహకులు పోటీ పడుతున్నారు. మొత్తానికి, గోదావరి జిల్లాల్లో సంక్రాంతి పండుగ పౌరుషానికి, విలాసానికి వందల కోట్ల వ్యాపారానికి వేదికగా మారబోతోంది.
ALSO READ: CP Sajjanar Warning: చైనా మాంజా వాడితే క్రిమినల్ కేసులే.. పండుగ పూట జాగ్రత్త!