Big Stories

Kalyandurg TDP : కళ్యాణదుర్గంలో తెలుగు తమ్ముళ్ల పంతం.. టికెట్ కోసం పోటాపోటి..

Kalyandurg TDP : కళ్యాణదుర్గం టీడీపీలో మూడుముక్కలాట నడుస్తోంది.. అక్కడ టికెట్ కోసం ముందు నుంచి ఇద్దరు సీనియర్ల మధ్య గట్టి పోటీ కనిపించింది. వారిలో ఒక్కరు కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే.. మరొకరు గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నేత.. ఈ సారి వారిద్దరిలో ఎవరికి టికెట్ దక్కుతుందా అని పార్టీ శ్రేణులు ఎదురు చూస్తుంటే.. ఇప్పుడు టికెట్ రేసులోకి ఒక కాంట్రాక్టర్ కూడా వచ్చి చేరారు. గతంలో పీఆర్పీలో పనిచేసిన ఆ బడా కాంట్రాక్టర్ టీడీపీ టికెట్ కోసం పెద్ద ఎత్తున లాబీయింగ్ చేసుకుంటున్నారంట. దాంతో కళ్యాణదుర్గం టీడీపీ రాజకీయం ఆసక్తికరంగా తయారైంది.

- Advertisement -

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం టీడీపీకి బలమైన నియోజకవర్గం. 2004 వరకు అది ఎస్సీ రిజర్వుడు కావడంతో.. టీడీపీలోని నేతలంతా కలసి కట్టుగా తమ అభ్యర్థిని గెలిపించుకునేవారు. అయితే అది జనరల్ సెగ్మెంట్ అయనప్పటి నుంచే పార్టీకి కష్టాలు మొదలయ్యాయి. 2004 నుంచి ప్రతిపక్షంలో ఉన్న టీడీపీకి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా అండగా ఉంటూ వచ్చిన.. ఉన్నం హానుమంతురాయచౌదరికి 2009 ఎన్నికల్లో కళ్యాణదుర్గం నుంచి పోటీ చేసే అవకాశం దక్కింది. అప్పట్లో నియోజకవర్గం మారిన రఘువీరారెడ్డి ఇక్కడ నుంచి కాంగ్రెస్ తరపున విజయం సాధించాడు.

- Advertisement -

2014లో ఉన్నం హానుమంతురాయచౌదరి ఎమ్మెల్యేగా గెలుపొందగలిగారు. తర్వాత 2019 ఎన్నికల్లో ఉన్నంకు వ్యతిరేకంగా చక్రం తిప్పిన.. జేసీ దివాకరరెడ్డి ఉరవకొండ నియోజకవర్గానికి చెందిన ఉమామహేశ్వర నాయుడికి కళ్యాణదుర్గం టికెట్ దక్కేలా చేశారు. అప్పట్లో ప్యాన్ గాలితో పాటు రఘువీరారెడ్డి భారీ ఎత్తున ఓట్లు చీల్చడంతో.. ప్రస్తుత మంత్రి ఉషా శ్రీచరణ్ విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో ఉన్నం వర్గం తటస్థంగా ఉండిపోయి పార్టీకి పనిచేయలేదని అప్పట్లో విమర్శలు వచ్చాయి.

ఎన్నికల తర్వాత నుంచిఉన్నం వర్సెస్ ఉమా మహేశ్వర్ నాయుడు వర్గాల మధ్య విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. ప్రతి పార్టీకార్యక్రమం పోటా పోటీగా నిర్వహిస్తూ సిగపట్లకు దిగుతున్నాయి. నియోజకవర్గంలో ఉన్నం వర్గానికి పట్టు ఉన్నప్పటికీ.. ఉమామహేశ్వర్‌ నాయుడికి జిల్లా నేతల అండదండలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది.. దీంతో రోజు రోజుకి నియోజకవర్గంలో వర్గ విభేదాలు ముదురుతున్నాయి. తాజాగా ఉన్నం కోడలు అయిన వరలక్ష్మీ కి టికెట్ ఇవ్వమని ఉన్నం వర్గం డిమాండ్ చేస్తుంది.. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో టికెట్ రేసులోకి ఇంకొకరు వచ్చి చేరారు.

అమిలినేని సురేంద్ర నాయుడు.. బడా కాంట్రాక్టర్‌గా ఏపీ, కర్నాటక, తెలంగాణల్లో పేరుందాయనకి.. 2009లో పిఅర్పీ అవిర్భావం సమయంలో ఆ పార్టీలో చేరారు. చిరంజీవి రాయలసీమ అభిమాన సంఘం పేరుతో రాయలసీమ వ్యాప్తంగా భారీగా అభిమానుల సమావేశాలు ఏర్పాటు చేసారు. పిఅర్పీలో అనంతపురం టికెట్ అశించారు. అయితే టికెట్ ఇవ్వక పోవడంతో పీఆర్పీ కార్యాలయాన్ని ఆయన అనుచరులు ధ్వంశం చేసారు.

సురేంద్రనాయుడు 2014 ముందు అనంతపురం అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ టికెట్ కోసం ప్రయత్నించారు. అప్పట్లో పెద్దఎత్తున పత్రికా ప్రకటనలిచ్చి.. నామినేషన్ వేయడమే ఆలస్యమన్నట్లు హడావుడి చేశారు. అయితే రాత్రికి రాత్రే టికెట్ ప్రభాకర్ చౌదరికే దక్కింది. టికెట్ వచ్చింది. తర్వాత సైలెంట్ అయ్యాడు. మరో వైపు వ్యాపారం బారీగా విస్తరించాడు. 2019లో కూడా అనంతపురం టికెట్ కోసం ప్రయత్నించారు. అయితే 2014లో ఏం జరిగిందో సేమ్ అదే జరిగింది.

దాంతో అనంతపురం అశలు వదిలేసుకున్న అమిలినేని సురేంద్ర నాయుడు ఈ సారి కళ్యాణదుర్గం మీదా దృష్టి పెట్టారు. కళ్యాణదుర్గం టీడీపీ టికెట్ కోసం పెద్ద ఎత్తున లాబీయింగ్ చేస్తున్నారంట. ఓ పోలీస్ అధికారి సాయంతో అయన టీడీపీ పెద్దలపై వత్తిడి తెచ్చే పనిలో పడ్డారంట. అర్థికంగా పార్టీకి సాయం చేస్తానంటూ బేరాలు పెడుతున్నారంట.

అయితే గత ఎన్నికల తర్వాత అయన కాంట్రాక్ట్ అవసరాల కోసం వైసీపీకి జైకొట్టారని.. సీఎం జగన్‌ని ఆకాశానికెత్తుతూ పుల్ పేజీ ప్రకటనలు ఇచ్చారంటూ.. సదరు పేపర్ కటింగులను.. కళ్యాణదుర్గం టీడీపీ శ్రేణులు అదిష్టానానికి పంపాయంట.. ఇప్పటికే వైసీపీ కళ్యాణదుర్గంలో అభ్యర్థిని సైతం ప్రకటించింది.. అక్కడ అనంతపురం ఎంపిగా ఉన్న రంగయ్య ఇక్కడకి షిఫ్ట్ అయి.. ఇప్పటికే ప్రచారం కూడా ప్రారంభించారు. అయితే టీడీపీ టికెట్ రేసులోకి ఉన్నం వర్సెస్ ఉమామహేశ్వర్‌లకు తోడు సురేంద్ర నాయుడు ఎంటర్ అవడంతో నియోజక వర్గం క్యాడర్‌లో అయోమయం నెలకొంది. వ్యాపార వేత్తగా ఏ ఎండకు ఆ గొడుగు పట్టే వ్యక్తి అని సురేంద్రపై మిగిలిన రెండు వర్గాలు ప్రచారం ప్రచారం మొదలుపెట్టాయి. దాంతో అసలు టికెట్ ఎవరికి దక్కుతుందో అర్థం కాక తలలు పట్టుకోవాల్సి వస్తోందంట కళ్యాణదుర్గం తమ్ముళ్లకి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News