వైఎస్సార్ జిల్లా పేరుని వైఎస్సార్ కడప జిల్లాగా మారుస్తూ ఏపీ కేబినెట్ తాజాగా నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో వైఎస్సార్ తాడిగడప మున్సిపాల్టీ పేరులోని వైఎస్సార్ అనే పదాన్ని పూర్తిగా తొలగించింది. ఈ రెండు నిర్ణయాలపై సహజంగా వైసీపీ నుంచి ఎవరైనా స్పందిస్తారేమోనని వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులు అనుకున్నారు. స్వయంగా జగన్ స్పందిస్తారని ఆశించారు. కానీ ఆ రెండూ జరగలేదు. వైఎస్సార్ పేరుపై తీసుకున్న కీలక నిర్ణయాలను పార్టీ పరంగా వైసీపీ ఖండించలేదు. అదే సమయంలో జగన్ నుంచి రియాక్షన్ లేదు. సోషల్ మీడియాలో కాస్తో కూస్తో హడావిడి జరిగింది కానీ వైసీపీ మాత్రం విభేదించలేదు. విచిత్రంగా టీడీపీ నేతలే ఈ నిర్ణయాలతో కాస్తంత అసంతృప్తికి లోనయ్యారు. అసలు కడప జిల్లా పేరు నుంచి వైఎస్సార్ ని డిలీట్ చేయాలనేది వారి డిమాండ్. కానీ ఇక్కడ కూటమి ప్రభుత్వం కక్షసాధింపులు, అనవసర వివాదాల జోలికి వెళ్లలేదు కాబట్టి వైఎస్సార్ పేరుని కడప జిల్లాతో కొనసాగించింది. కేవలం మున్సిపాల్టీ విషయంలో మాత్రం ఆ పేరు పూర్తిగా తొలగించింది.
షర్మిల రియాక్షన్..
కూటమి ప్రభుత్వ నిర్ణయంపై వైఎస్సార్ కుమార్తె, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల స్పందించారు. సీఎం చంద్రబాబుపై ఆమె ధ్వజమెత్తారు. అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు ఆయన వ్యవహారం ఉందన్నారు. గతంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు విషయంలో జగన్ తప్పు చేసినట్టే.. ఇప్పుడు చంద్రబాబు కూడా తప్పు చేశారన్నారు. గతంలో హెల్త్ యూనివర్శిటీ పేరులో ఎన్టీఆర్ ని తొలగించి వైఎస్సార్ అనే పేరుని చేర్చారు జగన్. ఆ నిర్ణయాన్ని నాడు కొంతమంది తప్పుబట్టారు. కూటమి అధికారంలోకి వచ్చాక తిరిగి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీగా పేరు మార్చారు. ఈ విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ షర్మిల కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టారు.
అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లుంది ముఖ్యమంత్రి చంద్రబాబు గారి @ncbn తీరు. అనాడు జగన్ గారు చేసిన తప్పే నేడు చంద్రబాబు గారు చేస్తున్నారు. అధికారంలో ఉండగా స్వర్గీయ NTR పేరు మార్చి YCP @YSRCParty ప్రభుత్వం అభిమానుల మనోభావాలు దెబ్బతినేలా చేస్తే.. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మహానేత YSR…
— YS Sharmila (@realyssharmila) March 18, 2025
అయితే కడప జిల్లా పేరు విషయంలో షర్మిల పెద్దగా ఫీల్ అవ్వలేదు. కడప జిల్లా పేరుని సవరించడంలో తనకు అభ్యంతరం లేదని, అయితే కృష్ణా జిల్లా తాడిగడప మున్సిపాల్టీ నుంచి వైఎస్సార్ పేరుని తొలగించడం సరికాదని ఆమె అన్నారు. వైఎస్సార్ అభిమానుల మనోభావాలు దెబ్బతినేలా చేస్తున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం మహానేత వైఎస్సార్ పేరు చెరిపేసి ప్రతీకారం తీర్చుకుంటోందని విమర్శించారు. ఈ నిర్ణయం వల్ల కోట్లాది మంది తెలుగు ప్రజల హృదయాలకు గాయమైందని అన్నారు షర్మిల.
వైఎస్సార్ జిల్లా పేరులో కడప చేర్చడం కరెక్ట్ అయితే.. మరి ఎన్టీఆర్ జిల్లా పేరులో కృష్ణా అనే పదం కూడా చేర్చాలి కదా అని లాజిక్ తీశారు షర్మిల. ఎన్టీఆర్ విజయవాడ జిల్లా అనో, లేక ఎన్టీఆర్ కృష్ణా జిల్లా అనో పేరు మార్చాలన్నారు. కేవలం కడప విషయంలోనే ఎందుకీ వివక్ష అని ప్రశ్నించారు.
షర్మిల వాదన కరెక్టా కాదా, ఆమె వ్యాఖ్యలతో ప్రభుత్వం తమ నిర్ణయం మార్చుకుంటుందా లేదా అనే విషయం పక్కనపెడితే, ఇటు జగన్ నుంచి స్పందన శూన్యం కావడం విశేషం. వైఎస్సార్ పేరు మార్పు వ్యవహారంలో జగన్ స్పందించలేదు సరికదా, వైసీపీ నుంచి కూడా ఎవరూ నోరు మెదపలేదు. కేవలం షర్మిల మాత్రమే పేరు మార్పు నిర్ణయాన్ని తప్పుబట్టారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులు.. ఈ విషయంలో జగన్ కంటే షర్మిల బెటర్ అని అంటున్నారు.