Sharmila on AP Budget: ఏపీ రాజధాని అమరావతికి బడ్జెట్ లో ఏ నిధులు కేటాయించక పోవడంతో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ సంచలన ట్వీట్ చేశారు. ఏపీ బడ్జెట్ ను కూటమి ప్రభుత్వం శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్ ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు. బడ్జెట్ లో సూపర్ సిక్స్ కు కేటాయించిన నిధుల గురించి షర్మిళ ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు.
ఆ ట్వీట్ లో ఏముందంటే.. కూటమి ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ సంఖ్య ఘనం – కేటాయింపులు శూన్యమన్నారు. అంతా అంకెల గారడి – అభూత కల్పనగా వర్ణించిన షర్మిళ, దశ – దిశ లేని.. పస లేని బడ్జెట్ గా పేర్కొన్నారు. రాష్ట్రం గుల్ల.. బడ్జెట్ అంతా డొల్ల అంటూ.. ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా, ఎన్నికల వాగ్దానాలను పూర్తిగా విస్మరించారన్నారు. సూపర్ సిక్స్ పథకాలకు పంగనామాలు పెట్టారని, ఇతర హామీలకు ఎగనామం పెట్టారన్నారు. ఇది మంచి ప్రభుత్వం కాదు.. ముంచే ప్రభుత్వం అని తొలి బడ్జెట్తోనే నిరూపితమైందని, సూపర్ సిక్స్ – సూపర్ ఫ్లాప్ అంటూ షర్మిళ సంచలన కామెంట్స్ చేశారు.
అన్నదాత సుఖీభవ పథకానికి కేవలం రూ.6,300 కోట్లు కేటాయించడం అరకొర నిధులుగా, రాష్ట్రంలో 54 లక్షల మంది రైతులు ఎదురుచూస్తుంటే.. రూ.11 వేల కోట్లు నిధులు కావాల్సి ఉంటే.. కేంద్రం ఇచ్చే మ్యాచింగ్ గ్రాంట్ కోసం రైతులను నిరీక్షణకు గురి చేయడం అన్యాయమన్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడుతుంటే ముష్టి రూ.300 కోట్లు ధరల స్థిరీకరణ నిధికి ఇవ్వడం ద్రోహమేనని తెలిపారు. తల్లికి వందనం పథకానికి నిధుల్లో కోత పెట్టారని, రాష్ట్రంలో 84 లక్షల మంది విద్యార్థులకు కావాల్సింది రూ.12,600 కోట్లు అయితే.. రూ.9,407 కోట్లు మాత్రమే కేటాయించారన్నారు.
దాదాపు రూ.3వేల కోట్ల మేర విద్యార్థుల సంఖ్య తగ్గించదలుచుకున్నారా? దీపం 2 పథకానికి ఏడాదికి అవసరం అయిన నిధులు సంఖ్య రూ.4500 కోట్లు కాగా, బడ్జెట్లో ఉచిత సిలిండర్ల పథకానికి కేటాయింపులు రూ.2601 కోట్లుగా పేర్కొన్న షర్మిళ, కోటిన్నర లబ్ధిదారులు ఉండగా సగం మేర కోత పెట్టదలుచుకున్నారా ? అంటూ ప్రశ్నించారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఊసే లేదని, రూ.3 లక్షల కోట్ల బడ్జెట్ లో నెలకు రూ.350 కోట్లు కేటాయించే పథకానికి నిధులు ఇవ్వడానికి కూటమి ప్రభుత్వానికి మనసు రాలేదన్నారు. నెలకు రూ.1500 ఇచ్చే మహాశక్తి పథకాన్ని మాయం చేశారని విమర్శించారు. కోటిన్నర మంది మహిళలను అన్యాయం చేశారని, రూ.10 లక్షల వరకు ఉచిత రుణాలు అని చెప్పి ఒక్క రూపాయి కేటాయించకుండా డ్వాక్రా మహిళలను మోసం చేశారన్నారు. నిరుద్యోగ భృతి పథకం ఊసే లేదని, జాబ్ క్యాలెండర్ ప్రస్తావనే లేదన్నారు.
Also Read: Posani Krishna Murali: పోసానికి తీవ్ర అస్వస్థత.. వైద్యపరీక్షలు నిర్వహిస్తున్న వైద్యులు..
నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.3 వేలు ఇస్తామని చెప్పి బడ్జెట్ లో ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా 50 లక్షల మంది నిరుద్యోగులను మోసం చేశారని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులను వంచించారని, రాష్ట్ర రాజధానికి ఒక్క రూపాయి కేటాయించకుండా, అప్పులతోనే అమరావతి కట్టాలని చూడటం మీ అవివేకానికి నిదర్శనమని షర్మిళ ట్వీట్ చేశారు. రాష్ట్ర ప్రజలను మోసం చేసి , ఎన్నికల హామీలను గాలికి వదిలేసి మసి పూసి మారేడు కాయ చేశారని, ఈ బడ్జెట్లో విజన్ లేదు, విజ్డం లేదు, కేవలం ఇంద్రజాలమేనని, మిషన్ లేదు మీనింగ్ లేదు కేవలం మహేంద్రజాలమే అంటూ షర్మిళ కామెంట్స్ చేయడం విశేషం.
కూటమి ప్రభుత్వం @JaiTDP @JanaSenaParty @BJP4Andhra తొలి బడ్జెట్ సంఖ్య ఘనం – కేటాయింపులు శూన్యం. అంతా అంకెల గారడి – అభూత కల్పన. దశ – దిశ లేని.. పస లేని బడ్జెట్ ఇది. రాష్ట్రం గుల్ల.. బడ్జెట్ అంతా డొల్ల. ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా, ఎన్నికల వాగ్దానాలను పూర్తిగా విస్మరించారు. సూపర్…
— YS Sharmila (@realyssharmila) February 28, 2025