Posani Krishna Murali: పోసాని కృష్ణమురళికి ఒక్కసారిగా ఆరోగ్యం క్షీణించడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. శుక్రవారం ఉదయం రాజంపేట జైలుకు తరలించగా, ఒక్కసారిగా కడుపులో నొప్పి, విరేచనాలు కావడంతో పోలీసులు హుటాహుటిన వైద్యుల సమక్షంలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. మొత్తం మీద పోసాని జైలుకు వెళ్లిన సుమారు 4 గంటల్లోనే తీవ్ర అనారోగ్యానికి గురికావడంపై, వైసీపీ ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించింది.
వైసీపీ మాజీ నేత పోసాని కృష్ణమురళిని అన్నమయ్య జిల్లా పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. రాయదుర్గంలోని మైహోం భుజ అపార్ట్మెంట్లో ఉన్న పోసానిని పోలీసులు అరెస్ట్ చేసి అన్నమయ్య జిల్లాకు తరలించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను జనసేన నాయకుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైనట్లు తెలుస్తోంది. పలు సెక్షన్ లతో నాన్ బెయిలబుల్ కింద పోసానిపై కేసులు నమోదయ్యాయి. అయితే ఇంట్లో అరెస్ట్ చేసిన పోలీసులు రాత్రికి రాత్రి హైదరాబాద్ నుండి ఏపీకి తరలించారు.
ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ కు పోసాని కృష్ణమురళిని పోలీసులు తీసుకెళ్లి విచారించారు. సుమారు 8 గంటల విచారణ అనంతరం పోలీసులు రాత్రి 9 గంటలకు న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. పోసాని రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలను పోలీసులు ప్రస్తావించారు. ప్రముఖ నటుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై దారుణమైన రీతిలో వ్యాఖ్యలు చేశారని, మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించేలా ఆయన భార్యపై అత్యంత అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని రిమాండ్ రిపోర్టులో పోలీసులు పొందుపరిచారు.
దళితుల్ని కించపరిచేలా, విద్వేషాలు రెచ్చ గొట్టేలా పోసాని వ్యాఖ్యలు చేశారని, రాజకీయ నాయకుల్ని, వారి కుటుంబాల్లోని మహిళలను అసభ్య పదజాలంతో దూషించారని పోలీసులు రిపోర్ట్ లో పేర్కొన్నారు. పోసాని కృష్ణమురళిపై రాష్ట్ర వ్యాప్తంగా 14 కేసులు నమోదు కాగా, న్యాయమూర్తి పలు సెక్షన్ లపై నమోదైన కేసులను తొలగించారు. ఆ తర్వాత 14 రోజుల రిమాండ్ విధిస్తున్నట్లు తీర్పునిచ్చారు.
దీనితో పోసానిని రాజంపేట సబ్ జైలుకు పోలీసులు తరలించారు. పోసానికి ఖైదీ నంబర్ 2261 ను కేటాయించారు. అయితే పోసాని అలా జైలుకు వెళ్లిన కొన్ని గంటల వ్యవధిలోనే అనారోగ్యానికి గురయ్యారు. ఇప్పటికే గుండె సంబంధిత వ్యాధితో భాద పడుతున్న పోసానికి ఒక్కసారిగా వాంతులు, విరేచనాలు కావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. వెంటనే రాజంపేట ప్రభుత్వ వైద్యుడి అధ్వర్యంలో పోసానికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. నిన్న విచారణ సమయంలో పోసానిని పరీక్షించిన వైద్యులు.. గుండె సంబంధిత వ్యాధితో పోసాని భాద పడుతున్నట్లు, ఆ సమయానికి షుగర్, బీపీ లెవెల్ నార్మల్ గా ఉన్నాయని తెలిపారు.
Also Read: Agri Budget: ఏపీలో వ్యవసాయ బడ్జెట్.. రైతులకు శుభవార్త
పోసాని అరెస్ట్ సమయంలో కూడా కాస్త ఆందోళనకరంగా కనిపించారు. అలాగే పోసానిని హైదరాబాద్ నుండి ఓబులవారి పల్లె పోలీస్ స్టేషన్ కు తరలించిన సమయంలో కారు నుండి దిగుతూ.. కాస్త కింద పడే స్థితిలో కనిపించారు. మొత్తం మీద పోసాని ఆరోగ్యంపై కుటుంబసభ్యులు ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నట్లు తెలుస్తోంది. పోలీసులు మాత్రం పోసాని ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద వహిస్తున్నారని చెప్పవచ్చు.