Vizag News: ఆ శిశువు జన్మకు ఏ పరమార్థం ఉందో కానీ, జన్మతః అద్భుతాన్ని సృష్టించింది. చనిపోయిందని ఆ శిశువు తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. వారి కన్నీటి వ్యథను ఆ దేవుడు ఆలకించాడో ఏమో కానీ, ఆ శిశువు శరీరంలో ఉన్నట్లుండి కదలికలు వచ్చాయి. ఇక అంతే వైద్యులు అలర్ట్ అయ్యారు.. ఆ తర్వాత ఏమి జరిగిందంటే?
విశాఖ కేజీహెచ్ లో అద్భుతం జరిగింది. అది కూడా మహా అద్భుతమే అంటున్నారు ఆ శిశువు తల్లిదండ్రులు. విశాఖ కేజీహెచ్ కు ఓ మహిళ ప్రసవ వేదనతో కాన్పుకై వచ్చింది. సదరు మహిళకు వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు. చివరికి ఆ మహిళ పండంటి ఆడబిడ్డను జన్మనిచ్చింది. అయితే బిడ్డ పుట్టిన సమయం నుండి ఒక్క కదలిక లేదు. డాక్టర్లు రాత్రంతా శ్రమించారు. బిడ్డలో మాత్రం ఎటువంటి కదలిక ఆనవాళ్లు వారికి కనిపించలేదు. ఆ తల్లిదండ్రులు మాత్రం బిడ్డ ఆరోగ్యం కుదుట పడాలని వేడుకుంటున్నారు.
చిట్టచివరకు ఆ శిశువు చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పండంటి బిడ్డ పుట్టిందని ఆనందపడ్డ ఆ తల్లిదండ్రుల కళ్లు చెమ్మగిల్లాయి.. రోదించాయి. అప్పటికే వైద్యులు, బిడ్డ చనిపోయినట్లు రికార్డుల్లో కూడా నమోదు చేశారట. చివరకు ఆ శిశువును వారి తల్లిదండ్రులకు అప్పగించారు వైద్య సిబ్బంది.
బిడ్డను ఎత్తుకున్న తల్లి రోదనకు కన్నీళ్లు సముద్రాన్ని తలపించేలా ప్రవహిస్తున్నాయి. అంతలోనే తన చేతిలోని బిడ్డ శరీరంలో కదలికలు వచ్చినట్లు ఆ తల్లి గమనించింది. దేవుడా అంటూ .. వెంటనే వైద్యుల దృష్టికి తీసుకెళ్లారు బిడ్డ తల్లిదండ్రులు. డాక్టర్లు కూడా అంతే వేగంతో కావాల్సిన వైద్యాన్ని అందించారు. చివరకు బిడ్డ సేఫ్ అంటూ వైద్యులు చెప్పేశారు.
అయ్యా.. మాకు దేవుడిచ్చిన బిడ్డయ్యా అంటూ ఆ తల్లిదండ్రుల ఆనందం వర్ణనాతీతం. ఏదిఏమైనా ఇక ఆశలు వదులుకొని వెళ్తున్న క్రమంలో, బిడ్డ బ్రతకడం, డాక్టర్లు అంతే స్థాయిలో స్పందించడంతో శిశువు తల్లిదండ్రులు, డాక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు.
చనిపోయిందనుకున్న శిశువులో కదలికలు
విశాఖ కేజీహెచ్లో ఆశ్చర్యకర ఘటన
శుక్రవారం రాత్రి ఓ శిశువుకు జన్మనిచ్చిన మహిళ.. శిశువులో కదలికలు లేకపోవడంతో రాత్రంతా శ్రమించిన డాక్టర్లు
శిశువు మృతి చెందినట్టు రికార్డ్స్లో ఎంటర్ చేసి తల్లిదండ్రులకు అప్పగింత.. అంబులెన్స్లో… pic.twitter.com/vShQDlsF2E
— BIG TV Breaking News (@bigtvtelugu) November 12, 2024