Sri Reddy : కూటమి ప్రభుత్వం కొలువు దీరినప్పటి నుంచీ సోషల్ మీడియాలో ఒకటే టాక్. శ్రీరెడ్డి అరెస్ట్ ఎప్పుడు అంటూ. ఫస్ట్ వికెట్ శ్రీరెడ్డినే అనుకున్నారు. అధికారంలోకి రాగానే లోపలేస్తారని అనుకున్నారు. రెడ్బుక్లో ఆమె పేరే ముందుందని భావించారు. లేట్ అవుతున్నా కొద్దీ తెలుగు తమ్ముళ్లు, జనసైనికుల్లో అసహనం, ఆగ్రహం పెరుగుతోంది. శ్రీరెడ్డిని ఎలాగైనా లోపలేయాల్సిందేనంటూ సోషల్ మీడియాలో రచ్చ జరుగుతోంది. తెలివైన శ్రీరెడ్డి ముందుగానే తలొగ్గింది. తనను క్షమించండి లోకేశ్ అన్నా అంటూ ఏడుపు మొదలుపెట్టింది. చంద్రబాబు, పవన్ కల్యాణ్లకు సారీ సారీ.. తనను వదిలేయండి.. రాష్ట్రం విడిచి వెళ్లిపోతానంటూ చేతులెత్తి మొక్కింది. కాళ్లా వేళ్లా పడినంత పని చేసింది. ఆ వేడుకోలు ఎఫెక్టో ఏమో.. శ్రీరెడ్డిపై ఉన్న కేసులపై విచారణ కాస్త స్తబ్దుగా మారిందంటున్నారు. కానీ…….
పోలీస్ స్టేషన్కు శ్రీరెడ్డి..
శ్రీరెడ్డి పోలీసుల విచారణకు హాజరయ్యారు. విజయనగరం జిల్లా పూసపాటిరేగ పీఎస్కు వచ్చారామె. చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్పై అసభ్యకర పోస్టులు పెట్టారంటూ శ్రీరెడ్డిపై ఫిర్యాదు నమోదైంది. గతేడాది నవంబర్ 13న నెల్లిమర్ల పీఎస్లో శ్రీరెడ్డిపై కేసు నమోదైంది. ఈ ఫిర్యాదుపైనే శ్రీరెడ్డిని విచారించారు సీఐ రామకృష్ణ. విచారణ అనంతరం 41ఏ నోటీసులు ఇచ్చి పంపించారు. అవసరమైతే మళ్లీ విచారణకు రావాల్సి ఉంటుందని చెప్పారు. ఇదీ సంగతి.
ఏపీ వ్యాప్తంగా కేసులు
బుతులు తిట్టడం, అనుచిత పోస్టులు పెట్టడం తదితర ఆరోపణలతో.. శ్రీరెడ్డి మీద ఏపీ వ్యాప్తంగా అనేక పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఓ 6 కేసుల్లో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ గత ఫిబ్రవరిలో హైకోర్టును ఆశ్రయించారు శ్రీరెడ్డి. చిత్తూరు పీఎస్లలో బెయిలబుల్ సెక్షన్లే పెట్టారు అక్కడి పోలీసులు. విశాఖ జిల్లా స్టేషన్లలో నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్ ఇచ్చింది కోర్టు. ఇంకా అనేక జిల్లాల్లో కేసులు ఉన్నాయి. వాటిలో ఒక కేసులో భాగంగా.. విజయనగరం జిల్లా నెల్లిమర్ల పోలీసుల ముందు అటెండ్ అయ్యారు శ్రీరెడ్డి.
Also Read : తల్లి పుట్టినరోజును పట్టించుకోని జగన్.. ఏం కొడుకండీ?
శ్రీరెడ్డిని వదిలేస్తారా?
ఎందుకోగానీ శ్రీరెడ్డి మీద స్పీడ్ తగ్గించారని అంటున్నారు. బోరుగడ్డ అనిల్ను తొలినాళ్లలోనే లోపలేశారు. రాజమండ్రి జైల్లో ఊచలు లెక్కబెట్టించారు. బోరుగడ్డలానే శ్రీరెడ్డి కూడా చంద్రబాబు, పవన్ కుటుంబ సభ్యుల మీద ఇష్ఠం వచ్చినట్టు చెలరేగిపోయింది. నోటికొచ్చినట్టు మాట్లాడింది. మరి, శ్రీరెడ్డిని ఇంకా ఎందుక ఉపేక్షిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు కూటమి కార్యకర్తలు. పోసాని కూడా మీడియా ముందు నోరేసుకుని పడితే.. ఆయన నోటికి తాళం వేసేలా.. చేతులకు బేడీలేశారు. వల్లభనేనికి సైతం చెక్ పెట్టారు. శ్రీరెడ్డి మాత్రం రెడ్ బుక్ వేట నుంచి ఎలా తప్పించుకుంటున్నారో అర్థం కావట్లేదని అంటున్నారు. ఇప్పుడు వీడియోలు పెట్టడం మానేసినా.. గతంలో పెట్టిన చెండాలపు వీడియోలకు ఇప్పుడు శిక్షించాల్సిందేననే డిమాండ్ కూటమి నేతల నుంచి గట్టిగా వినిపిస్తోంది.