Chandrababu Praja Galam Yatra Updates: టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. పలమనేరులో ప్రజాగళం యాత్ర చేపట్టారు. వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సీఎం వైఎస్ జగన్ రాయలసీమను రాళ్లసీమగా మార్చేశారని మండిపడ్డారు. ఓట్లు అడిగే హక్కు వైసీపీ నేతలకు లేదని విమర్శించారు.
తెలుగుదేశం హయాంలో రాయలసీమ అభివృద్ధి కోసం చేపట్టిన పనులను చంద్రబాబు వివరించారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చామన్నారు. ఈ ప్రాంతానికి ఎన్టీఆర్ కృష్ణా జలాలు అందించారని గుర్తు చేశారు. టీడీపీ పాలనలోనే తెలుగు గంగ, గాలేరు-నగరి, హంద్రీ-నీవా ప్రాజెక్టులను ప్రారంభించామని తెలిపారు.
ఏపీ విభజన తర్వాత తన హయాంలో చేపట్టిన పనులను చంద్రబాబు చెప్పుకొచ్చారు. సాగునీటి ప్రాజెక్టులకు భారీగా నిధులు కేటాయించామని తెలిపారు. 2014-19 మధ్య సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ. 62 వేల కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు. అందులో సీమలోనే రూ. 12 వేల కోట్లు ఖర్చు చేశామన్నారు. హంద్రీ-నీవా ప్రాజెక్టు కోసం రూ. 4 వేల కోట్లుపైగా ఖర్చు చేశామని తెలిపారు. ఆ సమయంలోనే చాలా ప్రాజెక్టుల నిర్మాణం 90 శాతం పూర్తైందన్నారు. కానీ మిగిలి 10 శాతం పనులు సీఎం వైఎస్ జగన్ పూర్తి చేయలేదని ఆరోపించారు.
Also Read: కంటెయినర్ పాలిటిక్స్.. లోకేష్ ట్వీట్.. వైసీపీ కౌంటర్..
రాయలసీమలో వైసీపీ హయాంలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదని చంద్రబాబు విమర్శించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 25 ప్రాజెక్టులను జగన్ రద్దు చేశారని మండిపడ్డారు. సీమలో ప్రాజెక్టులకు వైసీపీ హయాంలో రూ.2 వేల కోట్లే కేటాయించారని తెలిపారు. వైసీపీ నేతలు కబ్జాలకు తెగబడుతున్నారని ఆరోపించారు. భూములను ఆక్రమించుకుంటున్నారని విమర్శించారు. ఇలాంటి ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
ఏపీలో జనం గెలవాలంటే.. జగన్ దిగిపోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. బీజేపీతో పొత్తుపై వైసీపీ చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారు. గత ఐదేళ్లుగా కేంద్రం పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన అనేక బిల్లులకు వైసీపీ ఎంపీలు మద్దుతు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసమే తాము పొత్తు పెట్టుకున్నామన్నారు. మైనార్టీలకు జగన్ చేసిన మేలేంటని ప్రశ్నించారు.