వల్లభనేని వంశీ ఎట్టకేలకు జైలు నుంచి విడుదలయ్యారు. అప్పట్లో బెయిల్ రాకపోవడంతో మరింతగా కుంగిపోయినట్టు కనిపించిన వంశీ, బెయిలుపై విడుదలయ్యే సమయంలో కాస్త హుషారుగానే ఉన్నారు. మీడియాతో మాట్లాడేందుకు ఆయన ఆసక్తి చూపించలేదు. కనీసం ఆయన భార్య కూడా మీడియాతో మాట్లాడలేదు. జైలు వద్ద వైసీపీ నేతల హడావిడి మాత్రం యథాతథంగా ఉంది. వంశీ మెడలో ఆకుపచ్చ కండువా వేశారు. హుషారుగానా కారెక్కి ఇంటికెళ్లారు వంశీ. ఇక ఆయన విడుదల తర్వాత మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి.
నాని విమర్శలు..
వల్లభనేని వంశీని తప్పుడు కేసులు పెట్టి జైలులో పెట్టారని అన్నారు నాని. వైసీపీ నుంచి సహజంగా ఇలాంటి విమర్శలు వినిపించేవే. అయితే వంశీని అరెస్ట్ చేయడం వల్ల టీడీపీ తన గొయ్యి తాను తవ్వుకుందని కూడా అన్నారాయన. టీడీపీ రాజకీయానికి వారే చేతబడి చేసుకున్నట్టయిందని చెప్పారు. శునకానందం తప్పితే ఇంకేమీ సాధించలేదని కూడా అన్నారు నాని.
అక్రమ కేసులతో 140 రోజుల నుండి వంశీని ఇబ్బంది పెట్టిన కూటమి ప్రభుత్వం
వల్లభనేని వంశీ అరెస్ట్తో గన్నవరంలో తనకి తానుగా టీడీపీ గొయ్యి తవ్వుకుంది
వంశీ అరెస్ట్తో మీరు సాధించింది ఏంటి? ఒక్క శునకానందం తప్ప
-పేర్ని నాని గారు, మాజీ మంత్రి#CBNFailedCM#IdhiMunchePrabhutvam… pic.twitter.com/H7DiM0n3NA
— YSR Congress Party (@YSRCParty) July 2, 2025
మరి అదేంటి నానీ..?
నాని ఛలోక్తులు బాగానే ఉన్నాయి కానీ.. మరి వైసీపీ హయాంలో చంద్రబాబు అరెస్ట్ సంగతి ఏంటని ప్రశ్నిస్తున్నారు టీడీపీ నేతలు. అప్పుడు కూడా వైసీపీ సాధించింది శునకానందమే కదా అంటున్నారు. చంద్రబాబుని అరెస్ట్ చేసి వైసీపీ ప్రభుత్వం తనగొయ్యి తాను తవ్వుకున్న సంగతి నానీకి తెలియదా అంటున్నారు. వైసీపీ రాజకీయానికి వారే చేతబడి చేసుకున్నారు కదా అని లాజిక్ తీస్తున్నారు. అప్పట్లో చంద్రబాబుని అక్రమంగా అరెస్ట్ చేసి, బెయిల్ కూడా రాకుండా చేసి జగన్ శునకానందం పొందారని, దాని ఫలితంగానే ప్రతిపక్ష నేత అనే హోదా కూడా లేకుండా పోయిందని కామెంట్లు పెడుతున్నారు. ఇప్పుడు పక్కా ఆధారాలతో వంశీని పోలీసులు అరెస్ట్ చేశారని, అసలు కేసే లేకుండా చేయాలని అనుకుని ఫిర్యాదుదారుడ్ని కిడ్నాప్ చేసి వంశీ తప్పుమీద తప్పు చేసి అడ్డంగా బుక్కయ్యారని టీడీపీ నేతలు వివరించారు. వంశీపై పెట్టిన 10 కేసులకు సాక్ష్యాధారాలున్నాయని, కేసులు బలంగా ఉండబట్టే ఆయనకు ఒకేసారి అన్ని కేసుల్లో బెయిల్ రాలేదని గుర్తు చేశారు. కోర్టుల్ని ప్రభావితం చేయడం ఎవరి వల్లా కాదని, న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉండాలని నానీకి సూచించారు.
అదే నిజమైతే నీ పరిస్థితి..?
శునకానందం కోసమే అరెస్ట్ లు చేస్తే వంశీని లోపల వేసిన వాళ్లకి, పేర్ని నాని ఒక లెక్కా అని ప్రశ్నిస్తున్నారు టీడీపీ సానుభూతిపరులు. వంశీ పాపం పండింది కాబట్టి అరెస్ట్ అయ్యారని, పేర్ని నాని పాపం పండే రోజు దగ్గర్లోనే ఉందని అంటున్నారు. అరెస్ట్ అయిన వైసీపీ నేతలందరికీ ఆ పార్టీ బాధితులు అనే ముసుగు వేసి రాజకీయ స్వలాభం కోసం విమర్శలు చేస్తోందని అంటున్నారు టీడీపీ నేతలు. తప్పు చేయని చంద్రబాబుని అరెస్ట్ చేసి జైలులో పెట్టి వేధించారు కాబట్టే ప్రజల్లో తిరుగుబాటు వచ్చి, వైసీపీని అధికారానికి దూరం చేశారనేది టీడీపీ నేతల వాదన. ఇప్పుడు తప్పు చేసిన వంశీని అరెస్ట్ చేసినా, గుడివాడలో ఏ ఒక్కరూ మాట్లాడలేదని, కేవలం వైసీపీ నేతలే గొంతు చించుకుంటున్నారని విమర్శిస్తున్నారు.