ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకు మంత్రి పదవి.. ఈ వార్త బయటకు రాగానే జనసేన శ్రేణులు సంబరాల్లో మునిగిపోతే.. టీడీపీ సీనియర్ నేతల నుంచి కార్యకర్తల వరకు అంతా అసహనంతో రగిలిపోతున్నట్లు సమాచారం. ఎందుకంటే.. ఇది నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం. పవన్ కళ్యాణ్ ఒత్తిడి వల్ల చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారా? లేదా అన్ని సమీకరణాలు చేసిన తర్వాత ఆ నిర్ణయం తీసుకోవల్సి వచ్చిందా? అనే చర్చ ఇప్పటికే మొదలైంది. అయితే కూటమి బంధాన్ని చీల్చేందుకు కుట్రలు చేస్తున్న వైసీపీకి చెక్ పెట్టేందుకు ఇదే సరైన నిర్ణయమని చంద్రబాబు ఆలోచించి ఉంటారని తెలుస్తోంది. రాజ్యసభ ఎంపీగా ఢిల్లీ వెళ్తారనుకున్న నాగబాబును.. ఊహించని రీతిలో రాష్ట్ర మంత్రి పదవి వరించింది. అయితే, ఇందుకు ఆయన 6 నెలల్లో ఎమ్మెల్సీగా ఎన్నిక కావల్సి ఉంటుంది. ప్రస్తుతం గవర్నర్ ఆమోదంతో నాగబాబు బాధ్యతలు స్వీకరించే అవకాశాలున్నాయి.
నాగబాబును మంత్రి పదవిలోకి తీసుకోవడం వెనుక మరో కారణం కూడా ఉంది. తాజా నిర్ణయంతో ఏపీ రాష్ట్ర మంత్రివర్గంలో జనసేనకు దక్కిన పదవుల సంఖ్య నాలుగుకు పెరిగింది. ఈ నలుగురిలో ముగ్గురు కాపు సామాజిక వర్గానికి చెందినవారే కావడం గమనార్హం. ఇది కూడా ఒక రకంగా వైసీపీకి మింగుడుపడని విషయమే. ఎలాగైనా కాపు సామాజిక వర్గాన్ని తమ వైపు తిప్పుకోవాలని ప్రయత్నిస్తున్న వైసీపీలో మళ్లీ అలాంటి ఆలోచనలు రాకుండా చేశారనే చెప్పవచ్చు.
అంతా బాగానే ఉంది. కానీ, సమస్యల్లా టీడీపీ శ్రేణుల్లోనే. ఇప్పటికే ఈ పార్టీలోని కొంతమంది సీనియర్ నేతలకు చంద్రబాబు తీరు నచ్చడం లేదని తెలుస్తోంది. కారణం.. పవన్ కళ్యాణ్కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడమే. రాష్ట్ర మంత్రివర్గంలోకి వచ్చేందుకు ఎదురుచూస్తున్న కొంతమంది సీనియర్ టీడీపీ నేతలు.. చంద్రబాబు తీసుకున్న నిర్ణయంతో షాకయ్యారని తెలుస్తోంది. దీనిపై కొంతమంది తెలుగు తమ్ముళ్లు కూడా సోషల్ మీడియాలో బాహాటంగానే విమర్శలు చేస్తున్నారు. జనసేన మాయలో నుంచి చంద్రబాబు బయటకు రావాలని అంటున్నారు.
వారసత్వం వద్దంటివి కదా.. పవన్?
వారసత్వ రాజకీయాలు చెయ్యనని చెప్పినవాడివి.. అన్న నాగబాబుకు మంత్రివర్గంలో పదవి ఎలా ఇప్పించావని కొంతమంది ట్విట్టర్ (ప్రస్తుతం X) వేదికగా పవన్ కళ్యాణ్ను ప్రశ్నిస్తున్నారు. పైగా దాదాపు మూడు పదవులు కాపు సామాజిక వర్గానికే ఎందుకు? టీడీపీలో అనుభవం ఉన్న.. సీనియర్ నాయకులు ఉండగా నాగబాబుకే ఆ పదవిని ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందని ప్రశ్నిస్తారు. రాజ్యసభ సీటు వేరొకరికి కేటాయించేందుకు.. నాగబాబును ఈ పదవితో బుజ్జగించారా అని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయాలపై సోషల్ మీడియాలో వార్ గట్టిగానే నడుస్తోంది. మరి తెలుగు తమ్ముళ్ల అసహనాన్ని చంద్రబాబు నాయుడు గుర్తిస్తారో లేదో చూడాలి.
త్వరలో మంత్రివర్గంలో మార్పులు?
త్వరలో మంత్రివర్గంలో మార్పులు జరిగే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఇటీవలే చంద్రబాబు పలువురు మంత్రుల పనుతీరుపై అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కనీసం ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రజలకు చెప్పకపోతే ఎలా అంటూ మంత్రులను కడిగేశారు. పనితీరు మెరుగు పరుచుకోవాలని హెచ్చరించారు. ఇప్పటికే పలువురు మంత్రుల పనితీరుపై చంద్రబాబు నాయుడు ఫీడ్ బ్యాక్ తీసుకున్నట్లు సమాచారం.