Hindupur News : హిందూపురం మున్సిపల్ ఎన్నికలు ఉత్కంఠకు గురి చేస్తున్నాయి. ఫిబ్రవరి 3న మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఛైర్మన్ పదవి దక్కించుకునేందుకు పార్టీల ఎత్తుగడలతో రాజకీయ వేడి వాతావరణం నెలకొంది. వైసీపీ, టీడీపీ పార్టీలు తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు పోటాపోటీగా ప్రయత్నిస్తున్నాయి. దాంతో.. ఇరుపక్షాల తరఫున కౌన్సిలర్ల క్యాంప్ రాజకీయాలు మొదలైయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఏకంగా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రంగంలోకి దిగారు. దాంతో.. ఏపీలో ఈ వ్యవహారం ఉత్కంఠగా మారింది.
మొత్తం 38 వార్డులున్న హిందూపూర్ మున్సిపాలిటీని చేజిక్కించుకునేదుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న టీడీపీ.. తన వర్గాన్ని పెంచుకునేందుకు శ్రమిస్తోంది. అటు వైసీపీ నాయకులు వారి వర్గం కౌన్సిలర్లు చేజారిపోకుండా ఉండేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మున్సిపాలిటీలో మున్సిపల్ కౌన్సిలర్లలో 30 మంది సభ్యులున్న వైసీపీ.. ఛైర్మన్ సీటు కైవసం చేసుకుంటుంది అనుకున్నారు. కానీ.. ఇటీవల కాలంలో 12 కౌన్సిలర్లు టీడీపీలో చేరిపోయారు. మరో కౌన్సిలర్ కూడా ఇటీవల టీడీపీకి మద్దతు ప్రకటించారు. దీంతో.. టీడీపీ బలం 20కి పెరగగా.. వైసీపీ 18 మంది సభ్యులతో మెజార్టీకి అడుగు దూరంలో నిలిచిపోయింది.
దీంతో.. చివరి క్షణం వరకు ఛైర్మన్ పదవిని దక్కించుకునేందుకు ఎవరు, ఏ పార్టీకి జై కొడతారో అనే టెన్షన్ రాజకీయ వర్గాల్లో నెలకొంది. ముఖ్యంగా ఈ ఎన్నికల్ని హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో, ఈ ఎన్నికలో సత్తా చాటాలని టీడీపీ ప్రయత్నిస్తోంది. ఇప్పటికే.. మహిళా మంత్రి సవితకు మున్సిపాలిటీని గెలిపించుకునే బాధ్యతను అప్పగించారు. దాంతో.. తన అధీనంలోకి 21 మంది టీడీపీ కౌన్సిలర్లను ఉంచిన మంత్రి, ఫిబ్రవరి 3న మున్సిపల్ కార్యాలయానికి నేరుగా తరలించే యత్నం చేస్తున్నారు. ఈ పరిణామాలు మరింత ఉత్కంఠ సృష్టిస్తున్నాయి.
మరోవైపు.. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఐదుగురు కౌన్సిలర్లను తిరిగి వైసీపీలో చేరేలా వైసీపీ నేతలు ప్రయత్నాలు ప్రారంభించారు. ఒకవేళ అదే జరిగితే ఎన్నిక ఫలితాలు పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. దాంతో.. ఉన్న అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవదన్ని నిర్ణయించుకున్న వైసీపీ.. బలంగా ప్రయత్నాలు చేస్తోంది. హిందూపురంలో తమ పార్టీ విజయం సాధించేందుకు వైసీపీ నాయకులు, కార్యకర్తలు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు.
ఫిబ్రవరి 3న మున్సిపల్ చైర్మన్ ఎన్నికలను చేతులెత్తే పద్ధతిలో జరగనుండగా.. ఈ ఎన్నికల ప్రక్రియ ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది. టీడీపీ తరపున డీఈ రమేష్, వైసీపీ తరపున బలరామిరెడ్డి పోటీపడుతున్నారు. మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక దృష్ట్యా.. ఇప్పటికే, హిందూపురం చేరుకున్న టీడీపీ నేత నందమూరి బాలకృష్ణ, ఈ ఎన్నికలలో టీడీపీ విజయానికి పూర్తి మద్దతునిచ్చారు. హిందూపురం మున్సిపాలిటీ చైర్మన్ పీఠాన్ని దక్కించుకుంటామని బాలకృష్ణ ధీమా వ్యక్తం చేస్తున్నారు.