Hanuman Idol: తిరుమల ఘాట్ రోడ్డులోని ఏడో మైలు రాయి వద్ద కొలువుదీరిన ఆంజనేయస్వామి విగ్రహం మాయమవ్వడం ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే కాక, తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించింది. భక్తులు ఎంతో పవిత్రంగా భావించే స్వామివారి విగ్రహం చోరీకి గురికావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ ఘటనపై అటు పోలీస్ యంత్రాంగం దర్యాప్తు వేగవంతం చేయగా, ఇటు రాజకీయంగా తీవ్ర ఆగ్రహజ్వాలలు వ్యక్తమవుతున్నాయి.
తెల్లవారుజామున చోరీ.. పోలీసుల రంగప్రవేశం
జూలై 22, 2026 తెల్లవారుజామున సుమారు 3 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. మెట్ల మార్గంలో వెళ్లే వేలాది మంది భక్తులు దర్శించుకునే ఈ ఆంజనేయస్వామి విగ్రహాన్ని, గోవిందమాల ధరించిన ఒక వ్యక్తి తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే తిరుపతి జిల్లా పోలీసులు అప్రమత్తమై, టీటీడీ విజిలెన్స్ విభాగంతో కలిసి సంయుక్తంగా దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిని పట్టుకోవడానికి ఏకంగా 10 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా విచారణను తీవ్రతరం చేశారు.
ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ ఘాటు విమర్శలు
ఈ ఘటనపై ప్రతిపక్ష వైఎస్సార్సీపీ నాయకులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తిరుమలలో పవిత్రత దెబ్బతింటోందని, భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని ఆరోపించారు.
దేవుడికే రక్ష కరువైంది.. ఆరె శ్యామల
వైసీపీ పార్టీ అధికార ప్రతినిధి ఆరె శ్యామల అమరావతిలో మీడియా ముందు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు పాలనలో సాక్షాత్తు దేవుడికే రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమలలో దశాబ్దాల చరిత్ర కలిగిన విగ్రహం చోరీకి గురవడం తీవ్రమైన సిగ్గుచేటని, ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ టిటిడి ఛైర్మన్ బిఆర్ నాయుడు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఆయన పదవిలోకి వచ్చినప్పటి నుంచి కొండపై గోవులు మరణించడం, మద్యం, గంజాయి, మాంసం రావడం వంటి అపచారాలు తరచూ జరుగుతున్నాయని మండిపడ్డారు. ఛైర్మన్ బాధ్యతలను పక్కనపెట్టి, టీటీడీని ఒక టీవీ ఛానెల్లా నడుపుతూ దందాలు, సెటిల్మెంట్లకు అడ్డాగా మార్చారని ఆరోపించారు. మరి విగ్రహం చోరీపై కూటమి నేతలు ఎందుకు నోరు విప్పడం లేదని, గతంలో మెట్లు కడిగిన నాయకులు ఇప్పుడు ఎక్కడికి పోయారని తీవ్రంగా ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వంపై విశ్వాసం సన్నగిల్లిందని ఆమె పేర్కొన్నారు.
Also Read: పొగాకు రైతులకు జగన్ భరోసా.. త్వరలోనే పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటన!
భూమన కరుణాకరరెడ్డి..
తిరుమలలో ఆంజనేయ స్వామి విగ్రహం చోరీకి గురికావడం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించే అంశమని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి విమర్శించారు. సుమారు 46 ఏళ్ల క్రితం నాటి ఈ పురాతన విగ్రహాన్ని రోజూ వేలాది మంది భక్తులు దర్శించుకుంటారని, హనుమాన్ జయంతి రోజున ప్రత్యేక పూజలు కూడా జరుగుతాయని గుర్తుచేశారు. సీసీ కెమెరాల్లో చోరీ దృశ్యాలు రికార్డైనప్పటికీ, ఆ దొంగను పిచ్చివాడిగా చిత్రీకరించి కేసును నీరుగార్చే కుట్ర టీటీడీ విజిలెన్స్ విభాగంలో జరుగుతోందని ఆయన ఆరోపించారు.
తిరుమలలో నిత్యం ఏదో ఒక అపచారం జరుగుతోందని, కొండపై భద్రత కరువైందని మండిపడ్డారు. తిరుమల ప్రక్షాళన చేస్తామని చెప్పిన సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దీనికి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్నందుకు టీటీడీ పాలకమండలి చైర్మన్ బి.ఆర్. నాయుడు తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
Hanuman Idol Goes Missing on Tirumala Ghat Road pic.twitter.com/V9uf2QPaRd
— Donkana Vamsi (@DonkanaV0713) July 22, 2026