Tirumala News: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుని దర్శనం కోసం భక్తులు తహతహలాడుతుంటారు. ఏడాదిలో ఒక్కసారి శ్రీహరి దర్శించుకుంటే కొంతలో కొంతైనా కష్టాలు తొలగుతాయిని భావిస్తుంటారు. అందుకే వ్యయ ప్రయాసలకు ఓర్చి ఇబ్బందిపడినా శ్రీనివాసుని దర్శనం చేసుకుంటారు భక్తులు. రోజు రోజుకూ భక్తుల రద్దీ పెరుగుతుందే తప్పింతే ఏ మాత్రం తగ్గడం లేదు. అరకొర సౌకర్యాలు భక్తులకు సరిపోవడం లేదు.
ఫలితంగా దర్శనం దొరక్క కొందరు, వసతి సౌకర్యాలు లేక మరికొందరు ఇబ్బంది పడుతూనే ఉంటున్నారు భక్తులు. ప్రస్తుతమున్న సౌకర్యాలన్నీ దశాబ్దం కిందట నిర్మించినవే. వాటితో నెట్టుకుంటూ వచ్చేసింది పాలక మండలి. ఇప్పుడిప్పుడే కొత్త కొత్తగా నిర్మాణాలు చేపడుతోంది.
వేసవి రద్దీ.. ఆపై సిఫార్సు లేఖల రద్దు
వేసవి రద్దీ దృష్ట్యా సామాన్యులకు ప్రయార్టీ ఇవ్వాలనే లక్ష్యంతో తిరుమల దేవస్థానం కొత్త నిర్ణయం తీసుకుంది. వీఐపీ, సిఫార్సు లేఖలపై దర్శనాల భక్తులకు ఊహించని షాక్ ఇచ్చింది. మే ఒకటి నుంచి జూన్ 30 వరకు అంటే రెండు నెలలపాటు వీఐపీ బ్రేక్, సిఫార్సు లేఖల దర్శనాలను అనుమతించరాదని డిసైడ్ అయ్యింది. ఈ విషయాన్ని బోర్డు సభ్యుడు, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ వెల్లడించారు. ఇందుకు కారణాలు లేకపోలేదు.
వేసవి సెలవులు నేపథ్యంలో ఫ్యామిలీలతో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో వీఐపీ దర్శనాలకు సమయం కేటాయించడంతో భక్తులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. అందుకోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ రెండు నెలలు ప్రత్యేక దర్శనాలు, సుప్రభాతం దర్శనాలు సిఫార్సు లేఖల వారికి ఉండవని క్లారిటీ ఇచ్చారు. భక్తులకు ఎక్కువ సమయం కేటాయించేందుకు తిరుమల దేవస్థానం మొగ్గు చూపిందన్నమాట.
ALSO READ: స్కూల్ పక్కనే మత్తుమందు అమ్మకం, బానిసగా మారిన స్టూడెంట్ సూసైడ్
తిరుచానూరులో వసంతోత్సవాలు
మరోవైపు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షిక వసంతోత్సవాలు మొదలుకానున్నాయి. మే 11 నుంచి 13 వరకు ఆ ఉత్సవాలు చేయాలని టీటీడీ నిర్ణయించింది. మే 10న సాయంత్రం 6 గంటలకు ఈ కార్యక్రమానికి అంకురార్పణ జరగనుంది. ఇందులో పాల్గొనాలనే భక్తులు ఒక్కొక్కరు 150 రూపాయలు చెల్లించి హాజరుకావచ్చు. మే 12న ఉదయం 9.30 గంటలకు స్వర్ణ రథోత్సవం మొదలుకానుంది.
వసంతోత్సవాలు జరిగే మూడు రోజులు రకరకాల కార్యక్రమాలు జరగనున్నాయి. మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు అమ్మవారి ఊరేగింపు ఉంటుంది. శుక్రవారపు తోటలో అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం జరగనుంది. అలాగే రాత్రి ఏడున్నర నుంచి ఎనిమిదిన్నర వరకు ఆలయ మాడ వీధుల్లో ఊరేగింపు ఉంటుంది.
మే 6న అమ్మవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరగనుంది. ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలుపుతారు. ఉదయం 6 నుంచి 9 గంటల వరకు అమ్మవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరగనుంది. ఆలయ ప్రాంగణంలోని గోడలు, పైకప్పు మిగతా వస్తువులను శుద్ధి చేయనున్నారు.
నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీ గడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా వెదజల్లి సంప్రోక్షణం చేయనున్నారు. ఆ తర్వాత ఉదయం 9 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.