TTD: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి దర్శనానికి విచ్చేసే సామాన్య భక్తుల కోసం దృష్టిలో ఉంచుకుని.. వీఐపీ బ్రేక్ దర్శన సమయాల్లో మార్పులు చేసింది. ఈ కొత్త విధానం మే 1 నుంచి ప్రయోగాత్మకంగా అమలులోకి రానున్నట్టు టీటీడీ అధికారులు తెలిపారు.
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. నూతన షెడ్యూల్ ప్రకారం, మే 1వ తేదీ నుంచి వీఐపీ బ్రేక్ దర్శనాలను మార్నింగ్ 6 గంటల నుంచి ప్రారంభించనున్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న సమయాన్ని ముందుకు జరపడంతో.. తర్వాతి స్లాట్లలో సామాన్య భక్తులకు దర్శనానికి ఎక్కువ సమయం కల్పించవచ్చని టీటీడీ భావిస్తోంది.
ఇదే కాకుండా.. వేసవి సెలవుల కాలంలో (మే 1 నుంచి జూలై 15వ తేదీ వరకు) వీఐపీ బ్రేక్ దర్శనాల విషయంలో ఇంకొన్ని మార్పులు చేశారు. ఈ నిర్దిష్ట సమయంలో.. కేవలం ప్రోటోకాల్ పరిధిలోకి వచ్చే వీఐపీలు స్వయంగా తిరుమలకు వచ్చి దర్శనం చేసుకోవాలనుకుంటే మాత్రమే వారికి బ్రేక్ దర్శనం కల్పించనున్నట్టు తెలిపారు. సిఫార్సు లేఖల ద్వారా వచ్చే వారికి ఈ కాలంలో బ్రేక్ దర్శన సౌకర్యం అందుబాటులో ఉండదని టీటీడీ స్పష్టం చేసినట్లు సమాచారం. ఎండాకాలంలో శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ విపరీతంగా పెరిగే అవకాశం ఉన్నందున, సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకే.. ఈ నిర్ణయాల ముఖ్య ఉద్దేశ్యమని టీటీడీ వర్గాలు పేర్కొన్నాయి.
ఈ మార్పులను ముందుగా పరిశీలనాత్మకంగా అమలు చేసి, భక్తుల స్పందన, క్షేత్రస్థాయి పరిస్థితులను అంచనా వేసిన అనంతరం తదుపరి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. సామాన్య భక్తుల దృష్టిలో ఉంచుకుని టీటీడీ తీసుకుంటున్న నిర్ణయాలను పలువురు స్వాగతిస్తున్నారు.