Hanuman Idol: తిరుమల ఘాట్ రోడ్డులోని 7వ మైలురాయి వద్ద ఆంజనేయస్వామి విగ్రహం మాయమైంది. ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న ఈ సున్నితమైన కేసును తిరుపతి జిల్లా పోలీసులు ఎంతో ఛాలెంజింగ్గా తీసుకున్నారు. చోరీ జరిగిన కొన్ని గంటల్లోనే ఛేదించి తిరుమల శ్రీవారి భక్తులకు గొప్ప ఉపశమనాన్ని అందించారు.
ఘటన నేపథ్యం.. సీసీటీవీ దృశ్యాలు
జూలై 22 తెల్లవారుజామున సుమారు 3 గంటల ప్రాంతంలో 7వ మైలురాయి వద్ద ఉన్న ఆంజనేయస్వామి గుడిలోని విగ్రహం చోరీకి గురైంది. అప్రమత్తమైన టీటీడీ విజిలెన్స్, తిరుపతి పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించగా.. గోవిందమాల ధరించిన ఒక వ్యక్తి విగ్రహాన్ని తీసుకెళ్తున్నట్లు స్పష్టంగా కనిపించింది.
10 ప్రత్యేక బృందాలతో గాలింపు
కేసు తీవ్రతను బట్టి పోలీసు యంత్రాంగం ఏకంగా 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టింది. సాంకేతిక ఆధారాలు, టవర్ లొకేషన్లు , రవాణా మార్గాలను జల్లెడ పడుతూ నిందితుడు ఎటు వైపు వెళ్తున్నాడో నిమిష నిమిషానికి ట్రాక్ చేశారు.
హౌరా ఎక్స్ప్రెస్లో కస్టడీలోకి..
పోలీసుల పక్కా ప్లాన్ ఫలిచింది. రైల్వే పోలీసుల సహకారంతో నిందితుడు ప్రయాణిస్తున్న హౌరా ఎక్స్ప్రెస్ ట్రైన్ను గుర్తించి, అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి దొంగిలించబడిన ఆంజనేయస్వామి విగ్రహాన్ని క్షేమంగా స్వాధీనం చేసుకున్నారు.
కేవలం గంటల వ్యవధిలోనే దొంగను పట్టుకుని విగ్రహాన్ని స్వాధీనం చేసుకోవడంతో భక్తులు, టీటీడీ అధికారులు, స్థానికులు తిరుపతి పోలీసుల సమర్థతను ప్రశంసిస్తున్నారు.
Also Read: రోడ్లెక్కి ధర్నాలా? రాహుల్, ప్రియాంకలపై ఎంపీ ఈటల సంచలన వ్యాఖ్యలు!