Srisailam: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో దారుణం జరిగింది. ప్రైవేటు సత్రానికి వచ్చిన ఓ కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులున్నారు. వారంతా శ్రీసత్యసాయి జిల్లాకు చెందినవారు. దీని వెనుక ఏం జరిగింది? వివిధ కోణాల్లో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.
నంద్యాల జిల్లా శ్రీశైలంలో విషాదం చోటు చేసుకుంది. వడ్డెర ప్రైవేట్ సత్రంలో ఓ ఫ్యామిలీకి చెందిన ఐదుగురు కుటుంబం సభ్యుల ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. మృతులు సత్యసాయి జిల్లా బత్తలపల్లి గ్రామానికి చెందినవారిగా గుర్తించారు పోలీసులు. ఆగష్టు 20న ఆటోలో శ్రీశైలం మల్లన్న దర్శనానికి వచ్చింది ఐదుగురు సభ్యుల కుటుంబం. అందులో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు.
వడ్డెర సత్రంలో రూమ్ నంబర్ 11 లో ఉన్నారు. మూడు రోజులుగా గది నుంచి ఎవరూ బయటకు రాలేదు. పొరుగున రూముల్లో ఉన్నవారికి దుర్వాసన రావడం మొదలైంది. దీంతో ఈ విషయాన్ని సత్రం నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్లారు. ఆ తర్వాత ఈ విషయం పోలీసుల వద్దకు వెళ్లింది. పోలీసులు వచ్చిన తలుపులు తెరిచి చూడగా బాత్రూమ్లో ముగ్గురు మహిళలు ఉరి వేసుకున్న మృతదేహాలు కనిపించాయి.
మృతులు సత్యసాయి జిల్లావాసులు
ఫ్యాన్కు ఇద్దరు వ్యక్తులు వేలాడుతూ కనిపించారు. వెంటనే వారికి కిందకు దించి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మృతులు సుధాకర్-(36), గోగుల ఆదిలక్ష్మి- (50), మల్లేశ్వరి-(45), శ్రీదేవి-(33), మణికంఠ-(15)గా గుర్తించారు పోలీసులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ALSO READ: ఈడీ రిమాండ్ రిపోర్టులో షాకింగ్ విషయాలు.. కారుమూరి చుట్టూ ఉచ్చు, నెక్ట్స్ ఎవరో తెలుసా?
ఆత్మహత్యకు పాల్పడిన కుటుంబం ఆర్థిక ఇబ్బందులు కారణమై ఉండొచ్చని పోలీసుల ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఈ విషయం తెలియగానే సత్యసాయి జిల్లా బత్తలపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. మృతుల గురించి అక్కడి పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటన గురించి తెలియగానే మృతుల బంధువులు శ్రీశైలానికి చేరుకున్నారు.