Financial planning for couples| రాధిక గుప్తా ఒకప్పుడు ఎంతో సౌకర్యవంతమైన జీవితాన్ని గడిపారు. ఆమె భర్త మహేష్ గుప్తా రూ.కోట్ల ఆస్తులు కలిగిన వ్యాపారవేత్త. ఆయనకు నగరంలో పలు ఆస్తులు, అద్దె దుకాణాలు ఉండేవి. వడ్డీకి డబ్బులు ఇచ్చి కూడా ఆదాయం పొందేవారు.
రాధిక గుప్తా ఇంట్లో డబ్బుకు ఎప్పుడూ కొరత ఉండేది కాదు. ఒకప్పుడు ఆమె ఒంటి నిండా బంగారు ఆభరణాలు ధరించేవారు. ఇంటి పనుల కోసం సిబ్బంది కూడా ఉండేవారు. ఖర్చులకు ఆమె వద్ద ఎప్పుడూ కావాల్సినంత నగదు అందుబాటులో ఉండేది. దీంతో బంధువులు, పొరుగువారు ఆమెను ప్రేమగా ‘సేఠానీ’ (హిందీలో ధనవంతురాలు అని అర్థం) అని పిలిచేవారు.
రాధిక గుప్తా భర్త వ్యాపారం, పెట్టుబడులు, ఆస్తులు, ఆర్థిక లావాదేవీలన్నింటినీ స్వయంగా నిర్వహించేవారు. ఆమె కూడా తన భర్త నిర్ణయాలను పూర్తిగా నమ్మేవారు. రాధికా మాత్రం కుటుంబాన్ని, ముగ్గురు కుమారుల పెంపకాన్ని చూసుకోవడంపైనే ఆమె దృష్టి పెట్టారు. అయితే కుటుంబానికి చెందిన ఆస్తులు ఎక్కడున్నాయో ఆమెకు పూర్తిగా తెలియదు. బ్యాంకు ఖాతాలు, పెట్టుబడులు, ముఖ్యమైన పత్రాల వివరాలు కూడా ఆమెకు తెలియవు. భర్త ఉన్నంతకాలం ఈ విషయం పెద్ద సమస్యగా అనిపించలేదు. కానీ ఆయన ఆకస్మిక మరణంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి.
రాధిక గుప్తా భర్త గుండెపోటుతో అకస్మాత్తుగా మరణించారు. దీంతో కుటుంబ ఆర్థిక వ్యవహారాలను చూసుకునే వ్యక్తిని ఆమె కోల్పోయారు. తన భర్త సంపాదించిన ఆస్తుల గురించి పూర్తి సమాచారం ఆమెకు లేకపోవడంతో ఇబ్బందులు మొదలయ్యాయి. ఆమె కుమారులు కొన్ని పత్రాలు తీసుకొచ్చి సంతకాలు చేయాలని కోరారు. అవి ఆస్తులకు సంబంధించిన అవసరమైన ప్రక్రియలని చెప్పడంతో ఆమె నమ్మకంతో సంతకాలు చేశారు.
తర్వాత తన కుమారులు తండ్రి సంపాదించిన సంపదపై నియంత్రణ సాధించారని ఆమె పేర్కొన్నారు. చివరకు రోజువారీ ఖర్చుల కోసం కూడా ఆమె కుమారులపై ఆధారపడాల్సి వచ్చింది.
వైవాహిక జీవితంలో నమ్మకం చాలా ముఖ్యం. అయితే ఒక భాగస్వామి మాత్రమే మొత్తం ఆర్థిక వ్యవహారాలు తెలుసుకోవడం ప్రమాదకరం.
భార్యాభర్తలు కుటుంబానికి ఉన్న ఆస్తులు, అప్పులు, పెట్టుబడులు, బ్యాంకు ఖాతాల గురించి తెలుసుకోవాలి. ముఖ్యమైన పత్రాలు ఎక్కడ భద్రపరిచారో కూడా ఇద్దరికీ తెలియాలి.
వీలునామా ఉంటే మరణం తర్వాత ఆస్తుల బదిలీ ప్రక్రియ సులభమవుతుంది. వీలునామా లేకపోతే వర్తించే వారసత్వ చట్టాల ప్రకారం ఆస్తుల పంపకం జరుగుతుంది. అయితే చట్టపరమైన హక్కు ఉన్నప్పటికీ ఆస్తులను పొందడానికి కొన్ని ప్రక్రియలు పూర్తి చేయాలి. బ్యాంకులు, పెట్టుబడి సంస్థలు, ఇతర సంస్థలు తమ నిబంధనలను పాటిస్తాయి. అందుకే ఆరోగ్యంగా ఉన్నప్పుడే వీలునామా సిద్ధం చేసుకోవడం మంచిది. ఆస్తులకు సంబంధించిన నామినేషన్లను కూడా ఎప్పటికప్పుడు పరిశీలించాలి.
బ్యాంకు ఖాతాలు, పెట్టుబడులు, బీమా పాలసీలు, రుణాలు, ఆస్తుల పత్రాల వివరాలను ఒకచోట ఉంచాలి. పన్ను పత్రాలు, నామినేషన్లు, వీలునామా వివరాలను కూడా అందులో చేర్చాలి. ఈ సమాచారాన్ని సురక్షితమైన డిజిటల్ ఫోల్డర్లో భద్రపరచడం అలవాటు చేసుకోవాలి. భార్యాభర్తలు ఇద్దరూ ఆ సమాచారాన్ని ఎలా పొందాలో తెలుసుకోవాలి.
ఆస్తుల విషయంలో సమస్య ఏర్పడితే ముందుగా అసలు పరిస్థితిని పూర్తిగా తెలుసుకోవాలి. బ్యాంకు స్టేట్మెంట్లు, లావాదేవీల వివరాలు, ఒప్పందాలు, ఇతర పత్రాలను సేకరించాలి. అవసరమైతే న్యాయ, ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవాలి. తొందరపడి మరో ఆర్థిక నిర్ణయం తీసుకోకుండా జాగ్రత్త వహించాలి.
దంపతులు పిల్లల చదువు, రుణాలు, పెట్టుబడులు, రిటైర్మెంట్ గురించి మాట్లాడుతుంటారు. కానీ ఒకరు లేకపోతే కుటుంబ ఆర్థిక వ్యవహారాలు ఎలా కొనసాగాలనే విషయం కూడా చర్చించాలి. భార్యాభర్తలు కలిసి పెట్టుబడులు, బీమా, ఆస్తులు, నామినేషన్లు, దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను సమీక్షించాలి.
Also Read: ఆన్లైన్ షాపింగ్ వ్యసనంగా మారిందా? ఇదిగో మీ కోసమే కొత్త ఛాలెంజ్.. ఆర్థిక క్రమశిక్షణకు టిప్స్
రాధిక గుప్తా ఇప్పుడు తన వ్యక్తిగ ఖర్చుల కోసం నెలకు రూ.1000 మాత్రమే పొందుతున్నారు. ఆమె కథ సంపద కంటే ఆర్థిక అవగాహన ఎంత ముఖ్యమో చెబుతోంది. కుటుంబంలో ఒకరు మాత్రమే డబ్బు వ్యవహారాలు తెలుసుకోవడం భవిష్యత్తులో సమస్యలకు దారితీయవచ్చు.
భార్యాభర్తలు ఇద్దరూ తమ ఆస్తులు, పెట్టుబడులు, బీమా, పత్రాల గురించి తెలుసుకోవాలి. ఆర్థిక భద్రత అంటే సంపద కలిగి ఉండటం మాత్రమే కాదు. ఆ సంపదను ఎలా గుర్తించాలి, ఎలా పొందాలి, ఎలా రక్షించాలి అనే అవగాహన కూడా ఉండాలి.