తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ : తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న పలు చిక్కుముడి అంశాలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు సంబంధించిన భౌగోళిక, పరిపాలనా సమస్యలను మంత్రి వివరించారు. విభజన సమయంలో ఏపీలో కలిసిన ఏటపాక, కన్నాయిగూడెం, పిచ్చికలపాడు, పురుషోత్తపట్నం, గుండాల గ్రామాలను తిరిగి తెలంగాణలో విలీనం చేయాలని కోరారు. ఈ ఐదు పంచాయతీలు తెలంగాణ ప్రాంతాల మధ్య ఉండటం వల్ల అక్కడి గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. జిల్లా కేంద్రాలకు వెళ్లాలంటే ఎనిమిది గంటల ప్రయాణం చేయాల్సి వస్తోందని పేర్కొన్నారు.
భద్రాచలం సీతారామచంద్ర స్వామి ఆలయ భూములు కొన్ని ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఉండటం వల్ల దేవస్థాన పరిపాలనలో అడ్డంకులు ఎదురవుతున్నాయని మంత్రి వివరించారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలంటే ఈ గ్రామాల విలీనం అవసరమని స్పష్టం చేశారు. అలాగే ఖమ్మం జిల్లాలోని పెద్దవాగు సాగునీటి ప్రాజెక్ట్ శాశ్వత మరమ్మత్తుల అంశాన్ని కూడా ప్రస్తావించారు. ఈ ప్రాజెక్ట్ కింద సాగయ్యే భూమిలో 85 శాతం ఆంధ్రప్రదేశ్లో ఉంది. మిగిలిన 15 శాతం తెలంగాణలో ఉంది. దీని పునరుద్ధరణకు అయ్యే 92.20 కోట్ల రూపాయల వ్యయాన్ని ఇదే నిష్పత్తిలో ఇరు రాష్ట్రాలు భరించాలని విజ్ఞప్తి చేశారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఏపీ ప్రభుత్వం తక్షణమే నిధులు విడుదల చేయాలని కోరారు.భద్రాచలం పట్టణాన్ని వరదల నుంచి రక్షించే కరకట్ట నిర్వహణపై మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీ పరిధిలో ఉన్న కరకట్ట గోడ దెబ్బతిన్నదని దానివల్ల భవిష్యత్తులో ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇప్పటికే ఇరిగేషన్ అధికారులు సమాచారం ఇచ్చినప్పటికీ తగిన చర్యలు తీసుకోలేదని గుర్తు చేశారు. తక్షణమే సాంకేతిక పరిశీలన జరిపి శాశ్వత మరమ్మత్తులు చేపట్టాలని కోరారు. మరోవైపు ఖమ్మం పట్టణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి తిరుమల తిరుపతి దేవస్థానం అనుమతి ఇవ్వాలని అభ్యర్థించారు. అక్కడ భూమి గుర్తింపు పూర్తయిందని పనులు త్వరగా మొదలయ్యేలా చూడాలని విన్నవించారు.తిరుమల కొండపై తెలంగాణ భక్తుల వసతి కోసం ఐదు ఎకరాల స్థలం కేటాయించాలని మంత్రి తుమ్మల ప్రతిపాదించారు. ప్రత్యేక యాత్రికుల భవనం నిర్మిస్తే పండుగల సమయంలో భక్తులకు వసతి కొరత ఉండదని వివరించారు. రవాణా రంగానికి సంబంధించి సత్తుపల్లి-కొవ్వూరు, పెనుబల్లి-అమరావతి రైల్వే లైన్ల నిర్మాణానికి సహకరించాలని కోరారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే ఉభయ రాష్ట్రాల్లో వాణిజ్య పారిశ్రామిక అభివృద్ధి వేగవంతం అవుతుందని చెప్పారు. తెలుగు రాష్ట్రాల మధ్య సమన్వయం ఉంటేనే వేగవంతమైన పురోగతి సాధ్యమవుతుందని మంత్రి తుమ్మల అభిప్రాయపడ్డారు. ఈ విజ్ఞప్తులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.ALSO READ: Ibrahimpatnam Municipality: ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీపై రాళ్లతో దాడులు.. నేటికి చైర్మన్ ఎన్నిక వాయిదా?