Tirumala News: తిరుమల భక్తులకు శుభవార్త. తిరుమల శ్రీవారి దర్శనానికి రెండు నెలల ముందుగా టీటీడీ టికెట్లు విడుదల చేస్తోంది. అయితే జూన్ కోటాకు సంబంధించి వివిధ సేవలు, దర్శనం, వసతి టికెట్లు మార్చి 18 నుంచి రిలీజ్ చేస్తున్నారు అధికారులు. ఇప్పటికే ఆర్జిత సేవల టోకెన్లను విడుదల చేశారు. మార్చి 24న ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 టికెట్లు, వసతి గదులు టికెట్లు కోటా విడుదల కానుంది.
ప్రత్యేక దర్శన టికెట్ల కోటా రిలీజ్
సోమవారం ఉదయం 10 గంటల నుంచి ప్రత్యేక దర్శన టికెట్లను ఆన్ లైన్లో అందుబాటులో ఉంచుతోంది టీటీడీ. అలాగే మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతి, తలకోన ప్రాంతాల్లో వసతి గదుల కోటాను విడుదల చేయనుంది. శ్రీవారి భక్తులు టీటీడీ వెబ్సైట్ లేదా టీటీడీ దేవస్థానం యాప్ లో దర్శనం టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించింది టీటీడీ.
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో మార్చి 30న ఉగాది ఆస్థానాన్ని పురస్కరించుకుని మార్చి 25న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమం చేపట్టడం ఆనవాయితీ వస్తోంది.
మార్చి 25న ఉదయం 6 నుండి 11 గంటల వరకు అర్చకులు ఆగమోక్తంగా నిర్వహిస్తారు. ఆనంద నిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప ఆలయాలు, ఆలయ ప్రాంగణం, పోటు, గోడలు, పైకప్పు, పూజా సామగ్రి వస్తువులను శుభ్రంగా కడుగుతారు.
ALSO READ: భోగాపురం ఎయిర్ పోర్టు టు ఇనార్బిట్ మాల్
స్వామి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పుతారు. శుద్ధి అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయ అంతటా ప్రోక్షణం చేయనున్నారు. స్వామివారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా చేస్తారు. ఆ తర్వాత భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.
కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కారణంగా మార్చి 25న వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది. అలాగే అష్టదళ పాదపద్మారాధన సేవను సైతం రద్దు చేసింది. 24న ప్రొటోకాల్ ఉన్న ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించబోమని ఇప్పటికే తెలియజేసింది.
టీటీడీ బోర్డు సమావేశం
సోమవారం టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం జరగనుంది. టీటీడీ వార్షిక బడ్జెట్ను ఛైర్మన్ బీఆర్ నాయుడు ప్రవేశ పెట్టనున్నారు. ఛైర్మన్ గా ఆయనకు ఇదే తొలి బడ్జెట్. బడ్జెట్తోపాటు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోనుంది టీటీడీ బోర్డు. తిరుపతి అలిపిరి వద్ద ముంతాజ్ హోటల్ కు కేటాయించిన స్థలం రద్దు పై చర్చ జరగనుంది. వారికి మరొక ప్రాంతంలో స్థలం కేటాయింపుపై చర్చించనున్నారు.
హైకోర్టు ఆదేశాలతో అక్రమ కట్టడాలపై ఫోకస్ చేసింది టీటీడీ. తిరుమలలో ఉన్న మఠాలు, వాటి అక్రమ కట్టడాలపై చర్చించనున్న సభ్యులు. గడచిన ఐదేళ్లలో ఇబ్బడిముబ్బడిగా కొండపై మఠాలు వెలిశాయి. వాటిపై విజిలెన్స్ విచారణ చేసి నివేదికను బోర్డుకు అందజేసింది. ఆ నివేదికపై బోర్డు చర్చించనుంది.
అలాగే శ్రీవారి బ్రేక్ దర్శనం సమయం మార్పుపై చర్చించే అవకాశం ఉన్నట్లు టీటీడీ వర్గాలు చెబుతున్నాయి. టీటీడీలో కొనసాగుతున్న ప్రభుత్వ డిప్యుటేషన్ అధికారులను కొనసాగించాలా? వద్దా అనేదానిపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశముంది.
మరోవైపు తెలంగాణా ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై తొలిరోజు శ్రీవారిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శనం చేసుకున్నారు. మొదటి రోజు 550 నుండి 600 మంది వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలు కేటాయించిన టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. దర్శనం, వసతి కల్పిస్తున్న టీటీడీ అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు భక్తులు.