ఆంధ్రప్రదేశ్ లో ముఖ్య నగరాల్లో ఒకటిగా కొనసాగుతున్న విశాఖపట్నం.. రోజు రోజుకు మరింత అభివృద్ధి చెందుతోంది. తాజాగా వైజాగ్ లో నాలుగు కీలక ఇన్ ఫ్రా ప్రాజెక్టులు నిర్మాణం జరుపుకుంటున్నాయి. విశాఖ నగరాన్ని అభివృద్ధిలో మరో లెవల్ కు తీసుకెళ్లాబోతున్నాయి. ఇంతకీ ఆ ప్రాజెక్టులు ఏవి? ఎక్కడ కొలువుదీరుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
1.వరుణ్ హోటల్, ఆర్కె బీచ్
సింగపూర్ లోని ఐకానిక్ మెరీనా బే సాండ్స్ నుంచి ప్రేరణ పొందిన వరుణ్ గ్రూప్.. గేట్ వే హోటల్ స్థలంలో ఓ భారీ ప్రాజెక్టును నిర్మిస్తోంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు 2028 నాటికి పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది.ఈ ప్రాజెక్ట్ లో 3 టవర్లు ఉండబోతున్నాయి. సుమారు రూ. 500 కోట్ల పెట్టుబడితో ఈ హోటల్ రూపొందుతోంది. ఇందులో 5 స్టార్ డీలక్స్ హోటల్ ఉంటుంది. 374 సీ ఫేస్ గదులను నిర్మిస్తున్నారు. ఒక్కొక్కటి బాల్కనీలు, పలు రకాల ఫుడ్, డ్రింక్స్ ఎంపికలు, స్విమ్మింగ్ పూల్, టెర్రస్ పై హెలిప్యాడ్ లాంటి సౌకర్యాలను కలిగి ఉంటాయి. 280,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో గ్రేడ్ A ఆఫీస్ స్పేస్, 30,000 చదరపు అడుగుల లగ్జరీ రిటైల్ స్పేస్ ఉంటుంది. ఈ ప్రాజెక్టు వైజాగ్ లో లగ్జరీ టూరిజం, వాణిజ్య రంగానికి మరింత బూస్టింగ్ ఇవ్వనుంది.
2.భోగాపురం ఎయిర్ పోర్టు
రవాణా, పర్యాటక రంగానికి భోగాపురంలో రాబోయే అంతర్జాతీయ విమానాశ్రయం మరింత ఊపు తీసుకురానుంది. ఈ ఎయిర్ పోర్టు వైజాగ్ ను ప్రపంచంతో అనుసంధానం చేయబోతున్నది. 2,700 ఎకరాల్లో ఈ ఎయిర్ పోర్టును నిర్మిస్తున్నారు. సంవత్సరానికి 6 మిలియన్ల మంది ప్రయాణీకుల సామర్థ్యంతో దీన్ని రూపొందిస్తున్నారు. గరిష్టం 40 మిలియన్ల మంది ప్రయాణీకులు సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ప్రస్తుత విశాఖపట్నం విమానాశ్రయం గరిష్టంగా 3.5 మిలియన్ల మంది ప్రయాణీకుల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ ఎయిర్ పోర్టు పనులు 60 శాతం పనులు పూర్తయ్యాయి.
3.IIPE పర్మినెంట్ క్యాంపస్
వైజాగ్ లోని రెండు ప్రముఖ జాతీయ సంస్థలలో ఒకటైన ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ (IIPE) త్వరలో సబ్బావరంలో తన శాశ్వత క్యాంపస్ లోకి మారబోతోంది. 200 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఉన్న అత్యాధునిక క్యాంపస్ లో ఇంధన రంగంలో నాణ్యమైన విద్యను అందివ్వడంతో పాటు పరిశోధనలు జరగనున్నాయి.
Read Also: ఆస్తులు ఉండగానే సరిపోదు, సావిత్రమ్మ లాంటి దాణగుణం ఉండాలి!
4.ఇనార్బిట్ మాల్
రిటైల్ మాల్, వినోదరంగంలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న ఇనార్బిట్ మాల్ వైజాగ్ లో కొలువు దీరబోతోంది. కమర్షియల్ కార్యకలాపాల కోసం 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ మాల్ రూపొందుతోంది. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద మాల్ గా గుర్తింపు తెచ్చుకోబోతోంది. ఈ మాల్ హరిత నిర్మాణ ప్రమాణాలకు అనుగుణంగా రూపొందుతోంది. విశాఖపట్నంలో కొనసాగుతున్న ఈ 4 మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు నగరానికి మరిన్ని అదనపు అభివృద్ధి హంగులు అందించబోతున్నాయి. వైజాగ్ వాసుల జీవన నాణ్యతను మెరుగుపరచడంతో పాటు మరిన్ని ఉపాధి అవకాశాలను కల్పించనున్నాయి.
Read Also: సిమెంట్ వాడకుండానే ఇల్లు కట్టేశారు.. ఎలాగో తెలిస్తే దిమ్మతిరుగుద్ది!