BR Naidu missing: ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో మరోసారి రాజకీయ సెగలు రాజుకున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడు లక్ష్యంగా వెలిసిన ఒక ఫ్లెక్సీ ఇప్పుడు నగరంలో హాట్ టాపిక్గా మారింది. టీటీడీ అడ్మినిస్ట్రేటివ్ భవనం కాంపౌండ్ వాల్కు “టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు కనిపించడం లేదు” అంటూ వైసీపీ శ్రేణులు ఒక పెద్ద ఫ్లెక్సీని ఏర్పాటు చేశాయి. పాలనలో చైర్మన్ వైఫల్యాలను ఎండగట్టేందుకే వైసీపీ కార్యకర్తలు ఈ వినూత్న నిరసన చేపట్టినట్లు తెలుస్తోంది.
అయితే ఈ వివాదంలో టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది తీరు ఇప్పుడు విమర్శల పాలవుతోంది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే పరిపాలన భవనం వద్ద అంత పెద్ద ఫ్లెక్సీ కడుతున్నా సెక్యూరిటీ సిబ్బంది ఏమాత్రం పట్టించుకోకపోవడంపై విస్మయం వ్యక్తం అవుతోంది. అడుగడుగునా నిఘా ఉండే చోట ఫ్లెక్సీ వెలిసినా అధికారులు స్పందించకపోవడం వారి నిర్లక్ష్యానికి అద్దం పడుతోందని భక్తులు విమర్శిస్తున్నారు. ఫ్లెక్సీ వేసిన వారిపై కనీసం పోలీసులకు ఫిర్యాదు కూడా చేయకపోవడం వెనుక లోతైన కారణాలు ఉన్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ వ్యవహారంపై టీడీపీ శ్రేణులు తీవ్రంగా స్పందించాయి. టీటీడీ సెక్యూరిటీ సిబ్బందిపై పచ్చ దళం మండిపడుతోంది. భద్రతా సిబ్బంది వైసీపీకి అంటకాగుతున్నారని అందుకే ఫ్లెక్సీని అడ్డుకోలేదని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులపై రాజకీయ పరమైన నిరసనలు తెలుపుతుంటే మౌనంగా ఉండటం వెనుక అంతరార్థం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. చైర్మన్ పట్ల అగౌరవంగా వ్యవహరించిన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
రాజకీయ ఆరోపణలు విమర్శలు ఎలా ఉన్నా టీటీడీ వంటి పవిత్ర సంస్థ పరిధిలో ఇలాంటి చర్యలు జరగడం సరికాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తిరుపతిలో నెలకొన్న ఈ ఫ్లెక్సీ వివాదం శాంతిభద్రతల సమస్యగా మారకముందే పోలీసులు జోక్యం చేసుకోవాలని నగరవాసులు కోరుతున్నారు. టీటీడీ ఉన్నతాధికారులు ఈ భద్రతా లోపంపై ఎలాంటి విచారణ జరుపుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Read Also: కారుణ్య మరణానికి సుప్రీంకోర్టు పచ్చజెండా: 13 ఏళ్ల నిరీక్షణ తర్వాత హరీష్ రాణాకు విముక్తి!