TTD: వైకుంఠ ఏకాదశి సందర్భంగా టోకెన్ల వ్యవహారంపై నోరు విప్పారు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు. వైకుంఠ దర్శనం టోకెన్ల కోసం భారీగా కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వారాలు తెరిచే ఉంటాయిన్నారు.
శనివారం ఉదయం తిరుమలలో మీడియాతో మాట్లాడిన ఆయన, కేవలం వైకుంఠ ఏకాదశి రోజునే దేవాలయానికి రావాలనే నియమం లేదన్నారు. పది రోజుల్లో ఏ రోజైనా స్వామిని దర్శించుకోవచ్చన్నారు. ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నట్లు తెలిపారు.
జనవరి 10, 11, 12వ తేదీల్లో స్వామిని దర్శించుకోవాలని మాత్రం పెట్టుకోవద్దన్నారు. టోకెన్లను తీసుకోవాలన్న కంగారులో లేనిపోని ఇబ్బందులు వద్దని చెప్పకనే చెప్పారు. ఈ క్రమంలో వీఐపీలకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు.
గత ఐదేళ్లు టీటీడీలో జరిగిన లావాదేవీలపై విజిలెన్స్ నివేదిక ప్రభుత్వానికి ఇచ్చామ న్నారు. అంతేగానీ టీటీడీలో ఎలాంటి కమిటీ వేయలేదని ఈ సందర్భంగా వివరించారు. మరోవైపు ముంతాజ్ హోటల్ టీటీడీ స్థలం కాదు, ఏపి టూరిజం పరిధిలో ఉందన్నారు. దాన్ని టీటీడీ పరిధిలోకి తెచ్చేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని వెల్లడించారు.
ALSO READ: చీమకుర్తి.. జగన్ బినామీ? వైసీపీని వణికిస్తున్న రూ.700 కోట్ల భూకబ్జా కేసు
వైకుంఠ దర్శనం కోసం తిరుపతి, తిరుమలలో జనవరి 10, 11, 12 తేదీలకు సంబంధించి జనవరి 9న టోకెన్లు జారీ చేయనుంది. ఉదయం 5 నుండి 1.20 లక్షల టోకెన్లు జారీ చేయనుంది. తిరుపతి లో 8 కేంద్రాలలో 90 కౌంటర్లు, తిరుమలలో 4 కౌంటర్లు కలుపుకుని మొత్తం 94 కౌంటర్లలో టోకెన్లు మంజూరు చేయనున్నారు.
ఇక తిరుపతిలోని ఇందిరా మైదానం, రామచంద్ర పుష్కరిణి, శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణు నివాసం కాంప్లెక్స్, భూదేవి కాంప్లెక్స్, భైరాగి పట్టెడలోని రామానాయుడు ఉన్నత పాఠశాల, ఎంఆర్ పల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, జీవకోనలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వంటివి ఉన్నాయి. అదే విధంగా తిరుమలలో స్థానికుల కోసం తిరుమల బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు.
అదే విధంగా మిగిలిన రోజులకు (13 నుండి 19వ వరకు) ఏ రోజుకారోజు ముందు రోజు టోకెన్లు ఇవ్వనున్నారు. తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, విష్ణు నివాసంలలో మాత్రమే టోకెన్లు జారీ చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు.