Tirumala: కలియుగ వైకుంఠం శ్రీ శ్రీనివాసుడు వెలిసిన తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది. తిరుమల మాడవీధులు గోవింద నామస్మరణతో మారుమోగుతున్నాయి. అలిపిరి నుండి భక్తులు పెద్ద ఎత్తున కాలినడకన తిరుమల కు చేరుకుంటున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. జనవరి 10వ తేదీన వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి.
తిరుమల శ్రీవారిని బుధవారం 62,085 మంది భక్తులు దర్శించుకోగా, 15,680 మంది భక్తులు తలనీనాలు సమర్పించారు. ఈ సందర్భంగా శ్రీవారికి రూ. 4.17 కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్లు టీటీడీ ప్రకటించింది. అలాగే ఆరు కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నట్లు, ప్రస్తుతం శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పడుతుందని టీటీడీ ప్రకటించింది.
తిరుమలలో జనవరి 10 నుండి 19వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనానికి విచ్చేసే భక్తుల సౌకర్యార్థం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి చెప్పారు. తిరుమలలోని పలు ప్రాంతాలను అదనపు ఈవో, జెఈవో వీరబ్రహ్మం, జిల్లా ఎస్పీ సుబ్బ రాయుడు, సివిఎస్వో శ్రీ శ్రీధర్తో కలిసి పరిశీలించారు.
అనంతరం అదనపు ఈవో మీడియాతో మాట్లాడుతూ, వైకుంఠ ద్వారా దర్శనానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా టీటీడీ అధికారులు, విజిలెన్స్, పోలీస్ సిబ్బంది సమన్వయంతో దర్శనం కల్పించనున్నట్లు తెలిపారు. జనవరి 10, 11, 12వ తేదీలలో అధిక సంఖ్యలో భక్తులు వస్తారు కావున ఇందుకోసం అధికారులతో చర్చించి పూర్తి స్థాయిలో ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు.
దర్శనానికి విచ్చేసే విఐపిలకు వారికి అందించే పాసులలోనే దర్శన సమయం, పార్కింగ్ ప్రాంతం, ప్రవేశ, నిష్క్రమణ గేట్ల వివరాలు పొందిపరిచనున్నట్లు తెలిపారు. రాంబగిచా ప్రాంతంలో వాహన పార్కింగ్ ను ఈ రోజులలో బైటకు బదిలాయించినట్లు చెప్పారు. దీనికి బదులుగా 10 బగ్గీలు, అదనపు సిబ్బంది, సైన్ బోర్డులు ఏర్పాటు చేస్తామన్నారు. విఐపిలు, భక్తులు తమకు కేటాయించిన సమయం ప్రకారం మాత్రమే దర్శనానికి రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Also Read: Horoscope Today January 3rd: ఈ రాశి వారికి ఈరోజు ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది
అదేవిధంగా భక్తులు తమ పాదరక్షలను గదులలో, వారి వాహనాలలో వదలి రావాలన్నారు. అధిక రద్ధీ నేపథ్యంలో తోటి భక్తులకు ఇబ్బంది లేకుండా పారిశుద్ధ్యాని పాటించాలని, వ్యర్ధాలను టీటీడీ ఏర్పాటు చేసిన డస్ట్ బిన్లలోనే వేయాలని అదనపు ఈవో కోరారు. భక్తులకు సూచించిన నిబంధనలు పాటిస్తూ టీటీడీకి సహాకరించాలన్నారు.