Unduru youth Dileep: అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉండూరు గ్రామానికి చెందిన యువకుడు కొప్పిశెట్టి దిలీప్ (25) దేశ ప్రతిష్టాత్మక అంతరిక్ష సంస్థ ఇస్రోలో శాస్త్రవేత్తగా ఎంపికై అందరికీ ఆదర్శంగా నిలిచాడు. సాధారణ రైతు కుటుంబానికి చెందిన దిలీప్ అచంచల పట్టుదలతో దేశంలోని అతి ప్రతిష్ఠాత్మక గౌరవాన్ని అందుకున్న విధానం యువతకు స్ఫూర్తిదాయకమైంది.
ఉండూరు గ్రామానికి చెందిన కొప్పిశెట్టి సత్తిరాజు , బాలభువనేశ్వరి దంపతులు వృత్తిరీత్యా సాధారణ రైతులు. చిన్ననాటి నుంచే చదువు పట్ల ఆసక్తి చూపిన దిలీప్, ఎల్లప్పుడూ ఉన్నత లక్ష్యాలే పెట్టుకునేవాడు. అతని తల్లిదండ్రుల ప్రోత్సాహం, గురువుల మార్గనిర్దేశం, అతని కఠోర శ్రమ కలిసి ఈ విశేష విజయానికి దోహదం చేశాయి.
ఇంజనీరింగ్ పూర్తిచేసిన తర్వాత, దిలీప్ కొన్ని నెలలు డిలైట్ ఐటి కన్సల్టెన్సీలో పని చేశాడు. అయితే అతని లక్ష్యం ఐటి ఉద్యోగం కాదు. అతని నిజమైన కల దేశ సేవ, అంతరిక్ష పరిశోధన రంగంలో తన వంతు పాత్ర పోషించడం. దీంతో ఉద్యోగం చేస్తూనే GATE కోసం కష్టపడి సిద్ధమయ్యాడు.
2023లో జరిగిన GATE పరీక్షలో దిలీప్ 542వ ర్యాంకు సాధించాడు. ఆ స్కోర్తో ఐదు ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలకు అర్హత సంపాదించినప్పటికీ, అవి అతని కలలకు తగ్గట్లుగా లేవని భావించి ఆ అవకాశాలను వదిలేశాడు.
తనలో ఇంకా ఉన్న సామర్థ్యం తెలుసుకున్న అతను మరోసారి GATE పరీక్షకు సిద్ధమయ్యాడు. GATE 2025లో ఆల్ ఇండియా 296వ ర్యాంకు సాధించాడు.
GATE స్కోర్ ఆధారంగా జరిగిన ISRO ఇంటర్వ్యూలో కూడా అతను ఒడిదుడుకులేకుండా తన ప్రతిభను చూపించి దేశవ్యాప్తంగా 22వ ర్యాంకు సాధించాడు. ఈ ర్యాంకు ఆధారంగా అతను అధికారికంగా ISRO Scientist – SC పోస్టుకు ఎంపికయ్యాడు.
దిలీప్ ఎంపిక వార్త తెలియగానే ఉండూరు గ్రామంలో ఆనందం వెల్లివిరిసింది. తన కాలేజీ నుంచి, పాఠశాల నుంచి, మిత్రులు, బంధువులు, గ్రామ పెద్దలు అందరూ అతన్ని అభినందిస్తున్నారు. ఒక సాధారణ రైతు కొడుకు ఇస్రో శాస్త్రవేత్తగా ఎదగడం గ్రామంలోనే కాదు, మొత్తంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గొప్ప విషయంగా భావిస్తున్నారు.
Also Read: కృష్ణుడి విగ్రహం టచ్ చేస్తే ఊరుకోం.. మంగళగిరిలో హై టెన్షన్
ఇస్రోలో శాస్త్రవేత్తగా ఎంపిక కావడం ఏ చిన్న విషయం కాదు. దిలీప్ కథనమే కాకుండా అతని కట్టుబాటు, చదువు పట్ల ఉన్న ఆసక్తి ఇప్పుడు గ్రామంలోని అనేక మంది విద్యార్థులకు స్ఫూర్తిగా మారింది. “కష్టం చేస్తే ఏది సాధ్యమే” అన్న భావనను దిలీప్ నిలబెట్టాడు.