Amaravati: పరిశ్రమల ఏర్పాటులో ఏపీ ప్రభుత్వ జోరుని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు కేంద్ర ఉక్కు శాఖ కార్యదర్శి సందీప్ పౌండ్రిక్ టీమ్. తాము ప్రతిపాదించిన దాని కంటే ఏపీ ప్రభుత్వం ఎంతో ముందుందని ప్రశంసించింది. సోమవారం అమరావతికి కేంద్ర ఉక్కు శాఖ కార్యదర్శి సందీప్ పౌండ్రిక్ టీమ్ వచ్చింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు.
అమరావతిలో పర్యటిస్తున్న కేంద్ర ఉక్కు శాఖ కార్యదర్శి సందీప్ టీమ్
ఏపీలో పారిశ్రామిక ప్రగతికి ఊతమిచ్చే దిశగా ప్రభుత్వ నిర్ణయాలు, పరిశ్రమల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వ డీ-రెగ్యులేషన్ ఫేజ్-2 ప్రతిపాదనలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. పారిశ్రామిక అనుమతుల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ తీసుకున్న చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు.
డీ-రెగ్యులేషన్ ఫేజ్-3ని ఎప్పుడు ప్రారంభిస్తారని ముఖ్యమంత్రి ఆరా తీశారు. జూన్ నుంచి కసరత్తు చేస్తామని సందీప్ పౌండ్రిక్ తెలిపారు. ఫేజ్-3లో టెక్నాలజీ అనుసంధానం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ వినియోగానికి పెద్దపీట వేయాలని సూచన చేశారు చంద్రబాబు.
సీఎం చంద్రబాబుతో ఉక్కు శాఖ కార్యదర్శి టీమ్ భేటీ.. విధానాలపై ప్రశంసలు
తాము ఇప్పటికే డేటా లేక్, రియల్ టైం డేటా, సీఎఫ్ఎంఎస్, అవేర్-2.0, వాట్సాప్ గవర్నెన్స్ వంటి అధునాతన వ్యవస్థలను వినియోగిస్తున్నామని కేంద్ర బృందానికి వివరించారు ముఖ్యమంత్రి. పరిశ్రమల ఏర్పాటుకు అడ్డంకిగా ఉన్న 800కు పైగా నిబంధనలను కేవలం 100 లోపు కుదించాలన్నారు. అదేవిధంగా పర్మిషన్లు, లైసెన్సుల సంఖ్యను సింగిల్ డిజిట్కు పరిమితం చేయాలన్నారు.
ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే అది జీవితకాలం చెల్లుబాటు అయ్యేలా చూడాలన్నారు. అంతేకాదు డబుల్ లైసెన్సింగ్ వంటి పద్ధతులను పూర్తిగా తొలగించాలన్నారు. ఈ సంస్కరణలను మే చివరినాటికి తెచ్చేందుకు వీలుగా అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకురావాలన్నారు. దరఖాస్తు స్వీకరణ నుంచి అనుమతుల జారీ ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్ చేయాలన్నారు.
ALSO READ: ‘మావిగన్’.. జగన్ మైండ్లో అమరావతి లేనట్టేనా?
ఈ మార్పులతో పరిశ్రమల ఏర్పాటుకు పట్టే సమయంలో 40 శాతం ఆదా కావాలన్నారు. నిబంధనల సరళీకరణ పేరుతో ప్రజల భద్రత, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాల్లో రాజీ పడకూడదన్నారు. వేధింపులకు ఆస్కారం లేని విధంగా థర్డ్ పార్టీ తనిఖీలకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఫైర్ సేఫ్టీ విషయంలో నేషనల్ బిల్డింగ్ కోడ్ స్థానంలో ప్రత్యేక నిబంధనలు రూపొందించాలన్నారు. వీలైనంత అటవీ చట్టాలను సరళీకృతం చేయాలని కేంద్ర బృందానికి విజ్ఞప్తి చేశారు సీఎం.