Tirumala News: తిరుమలలో వైకుంఠ ద్వారా దర్శనాలకు ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. అయినా భక్తులు తండోపతండాలుగా శ్రీవారి దర్శనానికి వస్తున్నారు. ఈ నేపథ్యంలో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకున్న టీటీడీ, కీలక ప్రకటన చేసింది. డిసెంబర్ 30 అనగా మంగళవారం నుంచి గురువారం వరకు టోకెన్స్ ఉన్న భక్తులకు దర్శనం కల్పిస్తామని క్లారిటీ ఇచ్చింది.
తిరుమల భక్తులకు అలర్ట్
గోవిందా.. గోవిందా.. నామస్మరణతో తిరుమల గిరులు నిత్యం మార్మోగుతున్నాయి. కలియుగ వైకుంఠం శ్రీనివాసుడ్ని ఒక్కసారి దర్శించుకుంటే పాపాలు తొలగిపోతాయని భక్తులు ప్రగాఢ విశ్వాసం. అందుకే సుదూర ప్రాంతాల నుంచి వెంకటేశ్వరుడ్ని దర్శించుకునేందుకు అధికంగా తరలి వస్తుంటారు.
తాజాగా తిరుమలలో డిసెంబర్ 30 నుంచి జనవరి 8వ వైకుంఠ ద్వారా దర్శనాలకు అంతా రెడీ అయ్యింది. అందుకోసం అన్నిరకాల ఏర్పాట్లు చేశారు అధికారులు. భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో కీలక ప్రకటన చేసింది టీటీడీ. డిసెంబర్ 30 అనగా మంగళవారం నుంచి గురువారం వరకు ఈ-డిప్ ద్వారా టోకెన్లు పొందిన భక్తులకు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం ఉంటాయని వెల్లడించింది.
వైకుంఠ ద్వార దర్శనాలకు కొత్తగా మార్గదర్శకాలు
వీటికి సంబంధించి ఇప్పటికే లక్షా 76 వేల మందికి ఈ-డిప్ విధానంలో సర్వ దర్శన టోకెన్లను కేటాయించింది. టోకెన్ పొందిన భక్తులు కేటాయించిన తేదీలలో నిర్దేశించిన సమయానికి రావాలని పేర్కొంది. దర్శన ప్రవేశ మార్గాలకు చేరుకోవాల్సి ఉంటుందని వెల్లడించింది. డిసెంబర్ 30న 60 వేల మందికి టోకెన్లు జారీ చేసింది. వారి కోసం మూడు ప్రవేశ మార్గాలను ఏర్పాటు చేసింది.
ఉదయం దర్శనానికి వచ్చేవారు కృష్ణతేజ సర్కిల్ నుంచి రావాల్సి ఉంటుంది. మధ్యాహ్నం దర్శనానికి వచ్చేవారు ఏటీజీహెచ్ నుంచి రావాలి. రాత్రి వేళ దర్శనానికి శిలాతోరణం సర్కిల్ నుంచి దర్శనానికి అనుమతించనున్నట్లు పేర్కొంది. ఈ మూడురోజులు టోకెన్ లేని భక్తులకు ఎలాంటి దర్శనాలు ఉండవని తేల్చిచెప్పింది టీటీడీ.
ALSO READ: తిరుమల కల్తీ లడ్డూ కేసు.. భూమనను ప్రశ్నించిన సిట్
టోకెన్ పొందిన ప్రతి భక్తుడు రెండు నుంచి మూడు గంటల్లో వైకుంఠ ద్వారా దర్శనం కల్పించనుంది. జనవరి రెండు నుంచి 8 వరకు ఎలాంటి టోకెన్స్ లేకపోయినా సర్వదర్శనం ద్వారా భక్తులకు స్వామి దర్శనం చేసుకోవచ్చు. వైకుంఠ ద్వారా దర్శనం నేపథ్యంలో సుమారు 8 లక్షల మంది భక్తులు రావచ్చని అంచనా వేస్తోంది.
ప్రోటోకాల్ పరిధిలో ఉన్న ప్రముఖులకు బ్రేక్ దర్శనం కల్పించనున్నారు. భక్తులు ఇచ్చిన సూచనలను గమనించి తిరుమల పర్యటనను ఏర్పాటు చేసుకోవాలని తెలిపింది. శీతాకాలం కావడంతో భక్తులకు అందించే అన్న ప్రసాదాలు చల్లబడకుండా ప్రత్యేక జాగ్రత్తలు చేపట్టింది. తాగునీరు అందించేందుకు మొబైల్ వాటర్ డ్రమ్స్, మూడు మొబైల్ ఫుడ్ వ్యాన్లు అందుబాటులో ఉంచింది. అందుబాటులో ఉంచిన సదుపాయాలను వినియోగించుకునేందుకు వివిధ భాషల్లో సూచించే బోర్డులను ఏర్పాటు చేసింది.