తిరుమల లడ్డు కల్తీ ఉదంతంపై విశాఖపట్నంలో ఉత్తరాంధ్ర సాధు పరిషత్ కీలక సమావేశం నిర్వహించింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో రాష్ట్ర సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద సరస్వతి పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు. పవిత్రమైన శ్రీవారి లడ్డు తయారీలో రసాయనాలు కలిసినప్పటికీ భక్తులకు ఎలాంటి ప్రాణాపాయం కలగకపోవడం కేవలం ఆ శ్రీనివాసుని మహిమ అని ఆయన పేర్కొన్నారు. ఇంతటి ఘోర అపచారం జరిగినందుకు భక్తులంతా సామూహికంగా ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.
ఈ అపచారానికి నిరసనగా.. భక్తుల మనోభావాలను పరిరక్షించేలా త్వరలోనే విజయవాడలో రాష్ట్ర స్థాయి సాధు పరిషత్ సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. తిరుమలలో జరిగిన తప్పుకు పరిహారంగా ప్రతి భక్తుడు తన ఇంట్లో దీపం వెలిగించి.. ఆలయాల్లో ముడుపులు సమర్పించాలని కోరారు. గోవింద నామ స్మరణ ద్వారానే ఈ పాప ప్రక్షాళన జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా భక్తులందరూ ఒకే సమయానికి.. ఒకే రోజున నామ స్మరణ చేసేలా ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమ సమయాన్ని సాధు పరిషత్ త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తుందని తెలిపారు.
ఈ ధర్మ పరిరక్షణ పోరాటంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్లను కూడా భాగస్వాములు కావాలని కోరుతామని చెప్పారు. రాజకీయ విమర్శలకు తావులేకుండా భక్తి ప్రపత్తులతోనే ముందుకు సాగుతామన్నారు. కరుణాకర్ రెడ్డి వంటి వారు చేసే వ్యాఖ్యలను తాము పట్టించుకోవడం లేదని.. తమ లక్ష్యం కేవలం సనాతన ధర్మ రక్షణేనని శ్రీనివాసానంద సరస్వతి తెలిపారు. తిరుమల పవిత్రతను కాపాడటంలో భక్తులంతా ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు.
ALSO READ: Tirumala: తిరుమలలో అత్యంత విశిష్టమైన సేవ – భక్తులకు మాత్రం నో ఎంట్రీ