Vivekananda Murder Case: వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ కోర్టులో కీలక విచారణ జరిగింది. ఈ కేసులో లోతైన దర్యాప్తు (రీఇన్వెస్టిగేషన్) జరిపి, సప్లిమెంటరీ చార్జిషీట్ దాఖలు చేసేలా సీబీఐని ఆదేశించాలని కోరుతూ వివేకా కుమార్తె డాక్టర్ సునీత దాఖలు చేసిన పిటిషన్పై వాదనలు కొనసాగాయి. సునీత తరపున సీనియర్ కౌన్సిల్ సిద్ధార్థ్ తన వాదనలను కోర్టు ముందు వినిపించారు.
సీబీఐ ఈ కేసులో పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపలేదని, కేవలం ఒక దశ వరకు మాత్రమే విచారణ చేసి వదిలేసిందని సిద్ధార్థ్ వాదించారు. ఈ హత్య వెనుక బలమైన కుట్రకోణం ఉందని, దానిని సిబిఐ పూర్తిగా నిగ్గు తేల్చలేదని ఆయన ఆరోపించారు. దర్యాప్తును ఇక్కడితో ఆపేస్తే అసలైన దోషులు, సూత్రధారులు చట్టం నుంచి తప్పించుకునే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
హత్య జరిగిన రోజున, మొదట గుండెపోటుగా ప్రచారం చేసి, ఆ తర్వాత హత్యగా మార్చిన నాటకాన్ని ఆయన ప్రస్తావించారు. దీని వెనుక చాలా మంది హస్తం ఉందని, వారందరినీ బయటకు తీసుకురావాలంటే లోతైన దర్యాప్తు అవసరమని నొక్కిచెప్పారు. తాము అనేక ఆధారాలను సేకరించి సీబీఐకి అందించామని, ఆ కోణంలో దర్యాప్తు చేసి అసలు నేరస్తులను కూడా కేసులో చేర్చాలని కోరారు.
Read Also: Vijayawada: విజయవాడలో దారుణం: నర్సుగా పనిచేస్తున్న భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త
గతంలో సీబీఐ సేకరించిన కాల్ డీటెయిల్స్, టవర్ లొకేషన్లు, సెల్ ఫోన్ డేటా ఆధారంగా తిరిగి విశ్లేషణ చేస్తే, హత్య జరిగిన సమయంలో ఎవరు అక్కడున్నారు, ఎవరు ఫోన్ ద్వారా సూచనలు ఇచ్చారు అనే విషయాలు బయటపడతాయని అన్నారు. అందువల్ల, సీబీఐని తిరిగి దర్యాప్తు చేసి, సప్లిమెంటరీ చార్జిషీట్ దాఖలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు.
ఇదే కేసులో A2 నిందితుడిగా ఉన్న సునీల్ యాదవ్ కూడా కేసును తిరిగి దర్యాప్తు చేయాలని, అసలు దోషులు వేరేవాళ్లు ఉన్నారని పిటిషన్ దాఖలు చేసిన విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. ఈ రోజు సునీత తరపు న్యాయవాది వాదనలు ముగిశాయి. నిందితుల తరపు న్యాయవాదులు తమ వాదనలు రేపు వినిపించనున్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత, రీఇన్వెస్టిగేషన్, సప్లిమెంటరీ చార్జిషీట్పై సీబీఐ కోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రేపు మరోసారి విచారణ జరుగనుంది.