Doctor Suicide: మేడ్చల్ జిల్లాలో విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలు, ఆర్థికపరమైన గొడవలు ఒక వైద్యుడి ప్రాణాన్ని బలితీసుకున్నాయి. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంపల్లి దయారా ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో డాక్టర్ జోసఫ్ అనే వ్యక్తి ఇంజక్షన్ తీసుకుని ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర విషాదాన్ని నింపింది.
డాక్టర్ జోసఫ్, ఆయన భార్యకు 18 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొంత కాలం సాఫీగా సాగిన వీరి సంసారంలో గత కొంతకాలంగా ఆర్థికపరమైన విభేదాలు తలెత్తాయి. డబ్బు విషయంలో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. భార్య వేధింపులు మితిమీరిపోవడంతో, మానసిక వేదన భరించలేక ఆయన ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
జోసఫ్ మరణవార్త విన్న ఆయన తండ్రి కన్నీరుమున్నీరయ్యారు. తన కొడుకు భార్య వేధింపుల వల్లే ప్రాణాలు కోల్పోయాడని ఆయన తీవ్రంగా ఆరోపించారు. కోడలి ప్రవర్తన, ఆమె పెడుతున్న మానసిక ఒత్తిడే జోసఫ్ను ఆత్మహత్యకు ప్రేరేపించిందని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కీసర పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించారు. ఒక విద్యావంతుడు, సమాజానికి సేవ చేయాల్సిన డాక్టర్ ఇలా బలవన్మరణానికి పాల్పడటం అందరినీ కలిచివేస్తోంది.
Also Read: అమరావతికి కేంద్రం రాజముద్ర.. జగన్ పార్టీకి మైండ్ బ్లాక్ అయ్యే షాక్!