Vizag MLC Election botsa as YCP Candidate Suspense Continues TDP Candidate: ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికలో అధికార తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుందా? అభ్యర్థి ఎవరు? అన్న అంశాలపై క్లారిటీ లేకుండా పోయింది. ఒక వైపు వైసీపీ నుంచి పోటీలో ఉన్న బొత్స ప్రచారం కూడా షురూ చేసి ఓటర్లను కలుస్తున్నారు. అయితే కూటమి అభ్యర్థి ఎంపిక ఇంకా కొలిక్కిరాలేదు. చంద్రబాబునాయుడు సమక్షంలో జరిగిన జిల్లా ప్రజా ప్రతినిధులు, నాయకుల సమావేశంలో ఏ ఎన్నికల్లో పోటీపై మిశ్రమ స్పందన వ్యక్తమైంది. దాంతో అన్ని అంశాల్ని పరిశీలించేందుకు చంద్రబాబు ఆరుగురితో కమిటీని నియమించారు. ఏదేమైనా ఈ ఎన్నికల్లో వైసీపీకి మరో షాక్ ఇవ్వాలని కూటమి శ్రేణులు పట్టుదలతో కనిపిస్తున్నాయి.
ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉపఎన్నిక సందర్భంగా సార్వత్రిక ఎన్నికల వాతావరణం నెలకొంది. స్థానిక సంస్థల్లో బలమున్న వైసీపీ ఆ సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకుని ఎలాగైనా పరువు నిలబెట్టుకోవాలని పట్టుదలగా ఉంది. గ్రేటర్ విశాఖ కౌన్సిల్లో బలం ఉన్నప్పటికీ.. స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో పదికి పది స్థానాలు కోల్పోయిన వైసీపీకి పెద్ద షాకే తగిలింది. దాంతో ఎమ్మెల్సీ ఎన్నిక ఆ పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. అధికారంలో ఉన్నప్పుడు మంత్రులకే అపాయింట్మెంట్ ఇవ్వని జగన్.. ఇప్పుడు ఈ ఎన్నికల్లో గెలుపుకోసం ఎంపీటీసీలు, జడ్పీటీసీలతో మీటింగులు పెడుతున్నారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.
సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్సా సత్యనారాయణను అభ్యర్థిగా ప్రకటించిన వైసీపీ.. ఎలాగైనా గెలిచి తీరాల్సిందేనని గట్టిగానే ట్రై చేస్తోంది. అయితే విజయనగరం జిల్లాకు చెందిన బొత్సని ఇక్కడ పోటీకి నిలపడటంపై విశాఖ వైసీపీ నేతలు అసంతృప్తితో ఉన్నట్లు చెప్తున్నారు. బొత్స మాత్రం శాసనమండలిలో అడుగుపెట్టడానికి తనదైన శైలిలో చక్రం తిప్పుతున్నారు. స్థానిక సంస్థల ఓటర్లను కలుస్తూ.. వారికి టూర్లు అరేంజ్ చేస్తూ క్యాంపు రాజకీయాలతో గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. ఇతర జిల్లాలకు చెందిన వైసీపీ ముఖ్యనేతలు కూడా బొత్స విజయంపై ధీమాతోనే కనిపిస్తున్నారు.
అయితే.. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఎంపిక ఇంకా కొలిక్కిరాలేదు. ఉండవల్లి నివాసంలో ఉమ్మడి విశాఖపట్నం జిల్లా ప్రజా ప్రతినిధులు, నాయకులతో సమావేశమైన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతల అభిప్రాయాలు తెలుసుకుని జిల్లాలో పార్టీల బలాబలాలపై చర్చించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ విజయావకాశాలు ఎలా ఉంటాయి? స్థానిక సంస్థల ప్రతినిధుల్లో ఎంత మంది టీడీపీ వైపు మొగ్గు చూపుతారు? వంటి అంశాలపై వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు.
Also Read: మాట మార్చిన దువ్వాడ.. పవన్ కల్యాణ్ గురించి అప్పుడలా.. ఇప్పుడిలా..
పోటీపై జిల్లా ఎమ్మెల్యేలు, నాయకుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. జగన్ ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై వైసీపీ తరఫున గెలిచిన స్థానిక సంస్థల ప్రతినిధుల్లో చాలా మంది తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, మొదటి 11 నెలలు తప్ప.. ఆ తర్వాత వారికి గౌరవ వేతనం కూడా ఇవ్వలేదని ఎన్నికల ఫలితాల తర్వాత చాలా మంది ఎన్డీయే పార్టీలవైపు మొగ్గు చూపుతున్నారని ఎక్కువ మంది నాయకులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్సీ స్థానాన్ని గెలిచేందుకు అవసరమైనన్ని ఓట్లు కూడగట్టగలమని వారు భరోసా వ్యక్తం చేశారు. విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో జరిగిన స్టాండింగ్ కమిటీ ఎన్నికల ఫలితాలనే రిపీట్ చేస్తామని గట్టిగానే చెప్పారంట.
అయితే మరికొందరు నేతలు మాత్రం పోటీకి దూరంగా ఉండటం మంచిదని అభిప్రాయపడ్డారు. దీనిపై ఒక నిర్ణయానికి వచ్చేముందు మరింత లోతుగా అన్ని అంశాల్ని పరిశీలించేందుకు చంద్రబాబు ఆరుగురితో కమిటీని నియమించారు. టీడీపీ నుంచి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, హోం మంత్రి వంగలపూడి అనిత, మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణమూర్తి, జనసేన నుంచి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్బాబు, బీజేపీ నుంచి ఎమ్మెల్యే విష్ణుకుమార్రాజులను కమిటీలో నియమించారు. వారు మిగతా నాయకులతో చర్చించి తమ అభిప్రాయాన్ని చంద్రబాబుకు తెలియజేయనున్నారు. దీనిపై ఒకటి రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశమున్నట్టు పార్టీ వర్గాలు అంటున్నాయి.
అదలా ఉంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి తరపున పోటీ చేయడానికి తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు గండి బాబ్జి, పీలా గోవింద సత్యనారాయణ, మాడుగుల నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి పీవీజీ కుమార్, బత్తుల తాతయ్యబాబు రెడీగా ఉన్నారు. అనకాపల్లిలో సీఎం రమేష్ కోసం ఎంపీ సీటు వదులుకున్న టీడీపీ నేత బైరా దిలీప్ చక్రవర్తి పేరు కూడా పరిశీలనలో ఉందంటున్నారు. మరి పోటీపై టీడీపీ అధినేత నిర్ణయం ఎలా ఉంటుందో? బొత్సపై పోటీ చేసేదెవరో చూడాలి.