Visakhapatnam: విశాఖపట్నం మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ నేవీ ఆఫిసర్ వీరంగం సృష్టించారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి.. మద్యం మత్తులో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడమే కాకుండా విధుల్లో ఉన్న పోలీసులపై భౌతిక దాడికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది.
మల్కాపురం సమీపంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC) పైప్లైన్ పనులు జరుగుతుండటంతో భద్రతా కారణాల దృష్ట్యా పోలీసులు ఆ మార్గంలో వాహనాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఆదివారం తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో.. ఇండియన్ నేవీలో లెఫ్టినెంట్ కమాండర్గా పనిచేస్తున్న రాహుల్ కృష్ణన్ తన వాహనంలో VDR జంక్షన్ నుండి సింధియా జంక్షన్ వైపు అతివేగంగా దూసుకొచ్చారు. రహదారి మూసివేసి ఉండటంతో అక్కడ విధుల్లో ఉన్న ట్రాఫిక్ ఎస్సై శ్రీనివాసరావు, ఇతర సిబ్బంది ఆయన వాహనాన్ని అడ్డుకున్నారు.
మద్యం మత్తులో ఉన్న రాహుల్ కృష్ణన్.. పోలీసులు అడ్డుకోవడాన్ని సహించలేకపోయారు. కారు దిగి పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. ఎస్సై శ్రీనివాసరావు సర్దిచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ.. నిందితుడు విచక్షణ కోల్పోయి ఆయనపై దాడికి తెగబడ్డారు. ప్రభుత్వ ఉద్యోగి అని కూడా చూడకుండా అనుచితంగా ప్రవర్తిస్తూ భౌతిక దాడికి పాల్పడటంతో అక్కడున్న సిబ్బంది షాక్కు గురయ్యారు.
వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆయనకు డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించగా.. మద్యం సేవించినట్లు నిర్ధారణ అయ్యింది. బాధితుడైన ట్రాఫిక్ ఎస్సై ఫిర్యాదు మేరకు మల్కాపురం లా అండ్ ఆర్డర్ పోలీసులు రాహుల్ కృష్ణన్పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు అనంతరం కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. క్రమశిక్షణకు మారుపేరుగా ఉండాల్సిన రక్షణ రంగ అధికారి ఇలాంటి ఉన్మాద చర్యకు పాల్పడటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ALSO READ: Alluri district: తండ్రీకొడుకుల ప్రాణం తీసిన కోడిపుంజు.. నర్సింగ పేటలో తీవ్ర విషాదం!
ఫుల్లుగా తాగి ట్రాఫిక్ ఎస్సైని కొట్టిన నేవీ ఆఫీసర్ పై కేసు నమోదు
విశాఖపట్నం మల్కాపురంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పైప్ లైన్ పనులు జరుగుతుండడంతో రాకపోకలు నిలిపివేసిన ట్రాఫిక్ పోలీసులు
తెల్లవారుజామున అటు వైపు వెళ్తున్న వాహనాలు ఆపిన ట్రాఫిక్ ఎస్సై శ్రీనివాస్ రావును మద్యం మత్తులో… pic.twitter.com/LWX4p2K6XI
— BIG TV Breaking News (@bigtvtelugu) December 28, 2025