వక్ఫ్ సవరణ బిల్లుకి పార్లమెంట్ ఆమోదముద్ర పడింది. ఉభయ సభల్లో బిల్లు పాసైంది. ఇక రాష్ట్రపతి ఆమోదముద్రే తరువాయి. ఎన్డీఏకి ఉన్న మెజార్టీ దృష్ట్యా ఈ బిల్లు సునాయాసంగా పాస్ అవుతుందనే విషయం అందరికీ తెలుసు. అయితే బిల్లు పాస్ అయ్యే క్రమంలో వైసీపీ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
డబుల్ గేమ్..
బిల్లుని వ్యతిరేకిస్తాం, ఉభయ సభల్లో వక్ఫ్ సవరణ బిల్లుకి వ్యతిరేకంగా ఓటు వేస్తామని వైసీపీ ముందునుంచీ చెబుతోంది. తీరా బిల్లు చర్చకు వచ్చిన తర్వాత లోక్ సభలో బిల్లుని వ్యతిరేకించి, రాజ్యసభలో మాత్రం ఆ పార్టీ బిల్లుని సమర్థించిందని, వైసీపీ ఎంపీలు అనుకూలంగా ఓటు వేశారని టీడీపీ ఆరోపిస్తోంది. వైసీపీ ఎంపీలు రాజ్యసభలో అనుకూలంగా ఓటు వేశారంటూ టీడీపీ కొన్ని సాక్ష్యాలను చూపెడుతోంది. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఇక బిల్లుకి వ్యతిరేకంగా ఓటు వేయాలంటూ వైసీపీ జారీ చేసిన విప్ విషయం కూడా మోసం చేశారంటున్నారు. ఓటింగ్ తర్వాత విప్ జారీ చేశారని టీడీపీ నేతలు చెబుతున్నారు. అంటే ముస్లిం వర్గాన్ని మోసం చేయడానికి జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని, డబుల్ గేమ్ ఆడారని మండిపడుతున్నారు.
రెండు సభల్లో జగన్ నీచమైన డబుల్ గేమ్ ఆడాడు. #YSRCPDoubleStandardsExposed#WaqfAmendmentBill#WaqfBillAmendment pic.twitter.com/TxQlTLDaje
— Telugu Desam Party (@JaiTDP) April 4, 2025
అబ్బెబ్బె అదేం లేదు..
అయితే వైసీపీ మాత్రం అలాంటిదేమీ లేదంటోంది. రాజ్యసభలో కూడా ఎంపీలకు తాము విప్ జారీచేశామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. వైసీపీ ఎంపీలు బిల్లుని వ్యతిరేకించారనడానికి రికార్డయిన సభా కార్యకలాపాలే సాక్ష్యం అని అంటున్నారు. వైవీ సుబ్బారెడ్డి మాట్లాడిన వీడియోని వైసీపీ సోషల్ మీడియాలో సాక్ష్యంగా చూపెడుతోంది. వక్ఫ్ బిల్లుని వైసీపీ వ్యతిరేకించలేదు అని నిరూపించే దమ్ము టీడీపీకి ఉందా? అని ప్రశ్నిస్తున్నారు ఆ పార్టీ నేతలు. ఫేక్ న్యూస్ రాజకీయం చేయొద్దని అంటున్నారు.
రాజ్యసభలో మేం విప్ జారీచేశాం.
మేం వ్యతిరేకించామనడానికి రికార్డయిన సభా కార్యకలాపాలే సాక్ష్యం.
దీనికి సుబ్బారెడ్డిగారు మాట్లాడిన వీడియోనే ప్రత్యక్ష సాక్ష్యం.
మేం వ్యతిరేకించలేదు అని నిరూపించే దమ్ము మీకు ఉందా?
మీరు నిరూపించమని సవాల్ విసురుతున్నాం.
ఫేక్… https://t.co/LlPDPKpi9p pic.twitter.com/ffVYt8M4PF— YSR Congress Party (@YSRCParty) April 4, 2025
వ్యతిరేకించారా.. ? వ్యతిరేకంగా ఓటు వేశారా..?
లోక్ సభలో వక్ఫ్ బిల్లుకి వ్యతిరేకంగా వైసీపీ ఓటు వేసింది సరే, మరి రాజ్యసభ సంగతేంటి అనేదే ఇప్పుడు ప్రశ్నార్థకం. రాజ్యసభలో వైసీపీ ఎంపీలు బిల్లుకి వ్యతిరేకంగా మాట్లాడామని అంటున్నారే కానీ, ఓటు వేసిన వీడియోలను మాత్రం చూపెట్టలేకపోతున్నారు. అదే సమయంలో టీడీపీ కొన్ని సాక్ష్యాలని చూపెడుతోంది. ఆ సాక్ష్యాలను టీడీపీయే సృష్టించిందని వైసీపీ నేతలంటున్నారు.
పరువుపోయినట్టేనా..?
రాజ్యసభలో బిల్లుకి అనుకూలంగా వైసీపీ ఓటు వేస్తే మాత్రం జగన్ ని ఎప్పటికీ ముస్లిం సమాజం క్షమించదు. బిల్లుకి అనుకూలం అని టీడీపీ చెప్పింది, చెప్పినట్టే అనుకూలంగా ఓటు వేసింది. కానీ వైసీపీ మాత్రం తాము వ్యతిరేకిస్తామని చెప్పింది. అదే సమయంలో టీడీపీ ముస్లింలను మోసం చేసిందంటూ తీవ్ర ఆరోపణలు చేసింది. కానీ రాజ్యసభ ఓటింగ్ దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఏదో తేడా కొడుతోంది. రాజ్యసభ ఓటింగ్ గురించి అధికారిక సమాచారం బయటకొస్తేనే ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడుతుంది. అప్పటి వరకు వైసీపీ నిజాయితీని శంకించాల్సిందే. వక్ఫ్ బిల్లు విషయంలో ఏపీలో ముస్లింలతో కలసి ఆందోళన చేపట్టాలని వైసీపీ ఇప్పటికే ప్రణాళిక రచించింది. ఈ క్రమంలో ఈ ఆందోళనలు తేలిపోయే అవకాశముంది. రాజ్యసభలో వైసీపీ అసలు ఏం చేసింది..? వ్యతిరేకంగా మాట్లాడి సరిపెట్టిందా, లేక నిజంగానే వక్ఫ్ బిల్లుకి వ్యతిరేకంగా ఓటు వేసిందా..? అనేది తేలాల్సి ఉంది.