Pendurthi : సామాన్యులకు న్యాయం జరగాలంటే .. పోలీస్ స్టేషన్ల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సిందే. అయినా కూడా న్యాయం జరుగుతుందన్న గ్యారెంటీ లేదు. ఏపీ పోలీస్ వ్యవస్థపై ఇప్పటికే చాలా నెగిటివిటీ ఉంది. ప్రభుత్వ సపోర్ట్ ఉన్నవారికి తప్ప సామాన్య ప్రజలకు న్యాయం జరగడం అనే మాటే ఉండదు. అలా పోలీసుల తీరుతో విసిగిపోయిన ఓ మహిళ.. తనకు న్యాయం చేయాలంటూ ఆ స్టేషన్ కే తాళం వేసింది. ఈ ఘటన విశాఖ జిల్లాలో పెందుర్తిలో వెలుగుచూసింది.
పెందుర్తికి చెందిన గౌతమి పార్వతి అనే మహిళ తాను అద్దెకు ఉంటున్న అపార్ట్ మెంట్ ను కొనుక్కునేందుకు గ్రీన్ ట్రీ అపార్ట్ మెంట్ యజమానికి రూ. 5 లక్షలు ఇచ్చింది. అపార్ట్ మెంట్ రిజిస్ట్రేషన్ చేయలేదు సరికదా.. ఇళ్లు ఖాళీ చేయమని ఒత్తిడి చేశాడు. తాను ఇచ్చిన రూ.5 లక్షలు తిరిగి ఇవ్వాలని అడిగితే.. తన సామాన్లు మొత్తం బయటపడేశాడు. దాంతో తనకు న్యాయం చేయాలంటూ పెందుర్తి పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ ఇచ్చింది. ఐదు రోజులుగా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా.. పోలీసులు తనకు న్యాయం చేయకుండా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని, అందుకే పోలీస్ స్టేషన్ కు తాళం వేశానని ఆమె తెలిపింది. ఇప్పటికైనా తనకు న్యాయం చేయాలని, లేదంటే పోలీస్ స్టేషన్ ఎదుటే దీక్షకు దిగుతానని పార్వతి తెలిపింది.