Gaganyan : అంతరిక్ష అధ్యయనంపై భారత్ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే చంద్రయాన్ 3, ఆదిత్య ఎల్ 1 మిషన్ల ప్రయోగం చేపట్టి సూపర్ సక్సెస్ సాధించి ఇస్రో చరిత్రలో చిరస్థాయిగా నిలిచింది. ఈ రెండు ప్రయోగాలతోనే సరిపెట్టుకోకుండా మరో ప్రయోగానికి సన్నద్ధమవుతోంది. అదే గగన్యాన్ ప్రయోగం. వ్యోమగామిని పంపడమే లక్ష్యంగా ఈ ప్రయోగం జరగనుంది.
గగన్యాన్కు సంబంధించిన పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ ప్రయోగంపై ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా 2040 నాటికి చంద్రుడిపైకి తొలి భారతీయ వ్యోమగామిని పంపే లక్ష్యంతో పని చేయాలని శాస్త్రవేత్తలకు ప్రధాని నరేంద్ర మోడీ సూచించారు. అలాగే భవిష్యత్ రోదసీ కార్యక్రమాల గురించి ప్రధాని మోడీ సైంటిస్టులకు దిశానిర్దేశం చేశారు. వీనస్, మార్స్ గ్రహాలకు సంబంధించిన మిషన్లపై పని చేయాలని ప్రధాని పిలుపునిచ్చారు. ఈ ప్రయోగంలో భాగంగా అక్టోబర్ 21న శ్రీహరికోటలోని సతీష్ధావన్ స్పేష్ సెంటర్ నుంచి గగన్యాన్ మిషన్కు చెందిన మాడ్యూల్ను ఇస్రో పరీక్షించనుంది.
గగన్యాన్ కోసం టీవీ డీ1 అనే ప్రయోగాత్మక రాకెట్ను సిద్ధం చేసింది ఇస్రో. దీని సాయంతో క్రూ మాడ్యుల్ను అంతరిక్షంలోకి పంపిస్తుంది. రాకెట్ కొంత ఎత్తుకు చేరుకున్నాక ఎస్కేప్ సిస్టమ్ క్రియాశీలకమై క్రూ మాడ్యుల్ను రాకెట్ నుంచి వేరు చేస్తుంది. ఈ క్రమంలో క్రూ మాడ్యుల్ తిరిగి బంగాళాఖాతంలో పడుతుంది. నావికాదళం సాయంతో ఇస్రో క్రూ మాడ్యుల్ను స్వాధీనంలోకి తీసుకుని అందులోని డాటా ఆధారంగా రాకెట్, ఎస్కేప్ సిస్టమ్, క్రూ మాడ్యూల్ పనితీరును విశ్లేషిస్తుంది. అత్యవసర సందర్భాల్లో వినియోగించే ఎస్కేప్ సిస్టమ్ పనితీరును ఇస్రో ఈ ప్రయోగం ద్వారా పరీక్షిస్తోంది.