ఈ మధ్య సినిమా రిలీజులు కూడా రాజకీయాల చుట్టూ తిరుగుతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మెగా vs అల్లు.. వార్ జరుగుతోంది. మెగా, అల్లూ ఫ్యామిలీలో గొడవల సంగతి ఎలా ఉన్నా.. బయట అభిమానుల గొడవలు మాత్రం మామూలుగా లేవు. అయితే, అభిమానులు కొట్టుకోవడం.. తిట్టుకోవడం.. ఒకరిపై ఒకరు ట్రోల్స్ చేసుకోవడం సాధారణమే. కానీ, ఇప్పుడు కొట్టుకుంటున్నది ‘రాజకీయ’ అభిమానులు. ‘పుష్ప 2’ రిలీజ్ తర్వాత అది మరింత ముదిరింది.
ఏపీలో ‘పుష్ప 2’ రిలీజైన థియేటర్లలో వైసీపీ అభిమానుల ఫ్లెక్సీలు వెలిశాయి. అల్లు అర్జున్.. మావాడే అంటూ వైసీపీ నేతలు గర్వంగా చెప్పుకుంటూ తిరుగుతున్నారు. వైసీపీ ముఖ్య నేత అంబటి కూడా ఆ మూవీ రిలీజ్ రోజు నుంచి ప్రమోషన్ బాధ్యతలను తన భుజాలపై వేసుకున్నారు. వరుస ట్వీట్లతో వైసీపీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతున్నారు. దీంతో అంబటి వీలైనంత వరకు మెగా – అల్లు ఫ్యామిలీల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని అంతా మాట్లాడుకుంటున్నారు.
‘పుష్ప 2’ రిలీజ్ నుంచే అంబటి ఉత్సాహంగా ట్వీట్లు వేస్తున్నారు. తాజాగా ఒక అడుగు ముందుకేసి అల్లు అర్జున్ను ‘మనవాడు’ అంటూ మూవీ విజయాన్ని వైసీపీ ఖాతాలో వేసే ప్రయత్నం చేశారు. ‘‘ఇండియన్ సినిమా చరిత్రలో మొదటిరోజు రూ.294 కోట్లు కలెక్ట్ చేసినవాడు “మనవాడు” కావడం నాకు ఎంతో గర్వంగా ఉంది’’ అని ట్వీట్ చేశారు. అయితే, ఇక్కడ ఒక చిక్కు ప్రశ్న.. ఇంతకీ ‘మనవాడు’ అంటే అర్థం.. పార్టీ నేతా? లేదా ఇంకా ఏమైనానా అనే సందేహాలను వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్. అంతేకాదు.. ఆయన పోస్టు కింద కామెంట్లలో ట్రోల్ కూడా చేస్తున్నారు. ‘మనవాడు’ వచ్చాకే 11 సీట్లు వచ్చాయ్ అన్నో అంటూ అంబటిని ఆడేసుకుంటున్నారు. కొంతమందైతే బన్నీ మనకు ఏ యాంగిల్లో మనవాడో చెప్పొచ్చు కదా అని అంటున్నారు.
ఇండియన్ సినిమా చరిత్రలో
మొదటిరోజు 294 కోట్లు కలెక్ట్
చేసినవాడు "మనవాడు" కావడం
నాకు ఎంతో గర్వంగా ఉంది.— Ambati Rambabu (@AmbatiRambabu) December 6, 2024
ఆ విషయాన్ని పక్కన పెడితే.. జనసేన అధినేత, టాలీవుడ్ హీరో పవన్ కళ్యాణ్ నటించిన ‘బీమ్లా నాయక్’ మూవీ రిలీజ్ టైమ్లో అంబటి స్వరంగా వేరేగా ఉండేది. సినిమా టికెట్ల రేట్లు పెంచాలనే నిర్మాతల రిక్వెస్టుపై ఆయన అప్పట్లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ సందర్భంగా ఓ ట్వీటు వదిలారు. ‘‘పారితోషికాన్ని వెల్లడించకుండా సినిమా టికెట్ ధర గురించి మాట్లాడే నైతిక అర్హత ఏ ‘హీరో’కి లేదు’’ అని ట్వీటారు. మరి ఇది ‘పుష్ప 2’ హీరో అల్లు అర్జున్కు వర్తించదా? అని అడుగుతున్నారు. ఎందుకంటే.. ‘పుష్ప 2’ టీమ్ కూడా టికెట్ రేట్లు పెంచాలని ఏపీ ప్రభుత్వాన్ని రిక్వెస్టు చేసింది. ఇందుకు ప్రభుత్వం కూడా హుందాగా స్పందిస్తూ.. అందుకు అనుమతి ఇచ్చింది. అధికారంలో ఉన్నప్పుడు సినిమా టికెట్ల పెంపును వ్యతిరేకించిన వైసీపీ.. ఇప్పుడు మాత్రం సైలెంటుగా ఉంది. అంతేకాదు.. ఆ సినిమాకు ప్రమోషన్స్ కూడా బాగానే చేసింది.
పారితోషకాన్ని వెల్లడించకుండా
సినిమా టికెట్ ధర గురించి
మాట్లాడే నైతిక అర్హత
ఏ "హీరో"కి లేదు!— Ambati Rambabu (@AmbatiRambabu) December 24, 2021
బన్నీ కూడా పారితోషికాన్ని వెల్లడించాలా అంబటి?
సో.. అప్పట్లో అంబటి డిమాండ్ చేసినట్లే అల్లు అర్జున్ కూడా తన పారితోషికాన్ని వెల్లడించాలా? అంబటి అని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. ఆ మాటలు కేవలం మెగా హీరోలాకే వర్తిస్తాయా? అంటూ కడిగేస్తున్నారు. మరి, దీనిపై అంబటి ఏ సమాధానం చెబుతారో చూడాలి. అయితే వైసీపీ నేతలు మెగా-అల్లు ఫ్యామిలీల మధ్య పుల్లలు పెట్టే డ్యూటీ తీసుకున్నారని, అందుకే అంబటి, రామ్ గోపాల్ వర్మలు డ్యూటీ ఎక్కారని సోషల్ మీడియాలో కోడై కూస్తోంది. టీడీపీకి బాలయ్య, జనసేనకు పవన్ కళ్యాణ్ ఉన్నట్లే.. వైసీపీకి కూడా ఒక హీరో ఉండాలనే తపన వైసీపీ నేతల్లో బాగా పెరిగిపోయిందట. అందుకే.. ఎలాగైనా సరే అల్లు అర్జున్ను ‘మనవాడు’ అని కలిపేసుకొనే ప్రయత్నాల్లో ఉన్నారని కామెంట్లు చేస్తున్నారు. సో భవిష్యత్తులో వైసీపీ జెండాలో జగన్ ఫొటోతోపాటే.. అల్లు అర్జున్ ఫొటో కూడా కనిపించినా ఆశ్చర్యపోవక్కర్లేదని అంటున్నారు. అంబటి కూడా జగన్, అల్లు అర్జున్ ఫొటోలను తన చొక్కాపై చెరోవైపు పెట్టుకుంటారేమో అని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.
Also Read: ఏపీ రాజకీయాల్లో బన్నీ ఫైరా.. ఫెయిల్యూరా? వైసీపీ కలలు నిజమవుతాయా?