YCP Party Protest: కూటమి సర్కార్పై బురదజల్లేందుకు వైసీపీ సిద్ధమైందా? విద్యుత్ ఛార్జీల పెంపుతో ప్రజల్లోకి వెళ్లేందుకు స్కెచ్ వేసిందా? మీడియా సమావేశానికి రాకుండా, అధికార ప్రతినిధి శ్యామల ప్రత్యేకంగా వీడియో రిలీజ్ చేయడం వెనుక ఏం జరిగింది? ఇదే చర్చ రాజకీయ పార్టీల్లో జరుగుతోంది.
ఏపీలో అధికారం కోల్పోయిన తర్వాత అధికార ప్రతినిధిగా యాంకర్ శ్యామలను నియమించింది వైసీపీ. గడిచిన ఆరునెలల్లో రెండుమూడు సార్లు మీడియా ముందుకొచ్చారామె. అదీ కూడా రికార్డు ప్రెస్మీట్. ఆమె ప్రెస్మీట్లు చూసి వైసీపీ నేతలే నవ్వుకున్నారు. అదంతా తర్వాత అంశం.
ఇక అసలు పాయింట్కు వచ్చేద్దాం. ఏపీలో పెరిగిన విద్యుత్ ఛార్జీలపై ఈనెల 27న పోరుబాట రెడీ అయ్యింది వైసీపీ. ఇప్పటికే దీనికి సంబంధించి పోస్టర్లు సైతం రిలీజ్ చేసింది. నియోజకవర్గాల్లో విద్యుత్ కేంద్రాల అధికారులకు వినతి పత్రం అందజేత కార్యక్రమం అన్నమాట.
ఈ కార్యక్రమంపై వైసీపీలో కొందరు పెదవి విరుస్తున్నారు. అయితే పార్టీ అధికార ప్రతినిధి శ్యామల ఈసారి మీడియా ముందుకు రాకుండా ప్రత్యేకంగా వీడియో విడుదల చేశారు. గత టీడీపీ ప్రభుత్వంలో జరిగిన కొన్ని విషయాలను ప్రస్తావించారు. అందులో ముఖ్యమైనది బషీర్బాగ్ ఘటన. మీడియోలో దాని గురించే ఎక్కువగా చెప్పారు.
ALSO READ: విజయవాడలో టీడీపీ- బీఆర్ఎస్ నేతల భేటీ, ఏం జరిగింది?
ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్, పేదవాడి నడ్డి విరిగే విధంగా విద్యుత్ ఛార్జీల పెంచుతోందని ఆరోపించారు శ్యామల. ఎప్పుడుపడితే అప్పుడు విద్యుత్ అంతరాయం, మరోవైపు బిల్లులు షాక్ కొడుతున్నాయని చెప్పుకొచ్చారు. అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లో సామాన్యులపై వేల కోట్ల భారం మోపారన్నది ఆమె ప్రధాన ఆరోపణ.
పెంచిన విద్యుత్ ఛార్జీలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్ ఇవ్వాల్సిందేన్ననారు. ప్రజల పక్షాల పోరాడేందుకు వైసీపీ జనంలోకి వెళ్తుందన్నారు. డిసెంబర్ 27న ఈ కార్యక్రమంలో అందరు పాల్గొవాలని పిలుపు నిచ్చారు. మళ్లీ జగనన్నతో ఏపీని గొప్ప రాష్ట్రంగా మార్చుకుందామన్నారు.
శ్యామల రిలీజ్ చేసిన వీడియోపై అప్పుడే అధికార పార్టీ నుంచి కామెంట్లు విపరీతంగా పడిపోతున్నాయి. జగన్ ప్రభుత్వంలో ఐదేళ్లలో 9 సార్లు కరెంటు బిల్లులు పెంచారు. ఏం చేశారంటూ ప్రత్యర్థుల నుంచి కౌంటర్లు లేకపోలేదు. ప్రెస్మీట్లపై సెటైర్లు వేస్తారని భావించి అధికార ప్రతినిధిని ఆ పార్టీ దూరంగా పెట్టిందనే చర్చ జోరుగా సాగుతోంది.