ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంపై వైసీపీ మరోసారి కొత్త స్వరం ఎంచుకున్నది. గతంలో వైసీపీ సర్కార్ కొలువుదీరినట్టే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిందని ఆ పార్టీ నేతలు భావించడం లేదట. ఏదో మతలబు చేసి కూటమి ప్రభుత్వం కొలువుదీరిందని ఇప్పటికీ ఆ పార్టీ నేతలు ప్రచారం చేస్తున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇదంతా సాధ్యమేనా? అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.2019 ఎన్నికల్లో వైసీపీ ఈవీఎం ఓటింగ్ ద్వారానే అధికారంలోకి వచ్చింది.2024లోనూ కూటమి సర్కార్ అలాగే ఈవీఎం ఓటింగ్ ద్వారా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.అప్పుడు, ఇప్పుడూ ఎన్నికల సంఘమే పర్యవేక్షణ చేసింది.వైసీపీ అధికారంలోకి వస్తే ఎన్నికలు సజావుగా జరిగాయని.. కూటమి అధికారంలోకి వస్తే మానిపులేషన్ జరిగిందని ఎలా మాట్లాడుతారని తెలుగుతమ్ముళ్లు నిలదీస్తున్నారు.
అధికారం ఏ పార్టీకి శాశ్వతం కాదనే విషయాన్ని వైసీపీ నేతలు మరిచినట్టు ఉన్నారు. ఎందుకంటే వారు అధికారంలో ఉన్నప్పుడు తాము పదేండ్లు అధికారంలో ఉంటామని నాడు సీఎం హోదాలో ఉన్న జగన్ పలుమార్లు చెప్పుకొచ్చారు. తాము అమలు చేస్తున్న సంక్షేమమే గట్టెక్కిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ, వారు అభివృద్ధి గురించి, ఉద్యోగాల కల్పన గురించి పెద్దగా ఆలోచన చేయలేదు. సంక్షేమ ఫలాలు అందుకుంటున్న వారంతా తమకే ఓటు వేస్తారని, సామాజిక వర్గాలు సైతం తమకే అనుకూలంగా ఉన్నాయని జగన్ భావించారు.
తీరా ఎన్నికలు దగ్గర పడ్డాక మరోసారి అదే ధీమాతో దౌర్జన్యాలకు పాల్పడ్డారు. ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక ఒక్కసారిగా డీలా పడిపోయారు. తమ ఓటమిని అంగీకరించని వైసీపీ నేతలు ఆ నెపాన్ని ఈవీఎంల మీద వేయడం ప్రారంభించారు.
బొత్స సత్యనారాయణ ఉమ్మడి ఏపీలో చాలా సీనియర్ నేత. వైఎస్సార్ హయాంలో ఆయన మంత్రిగా కూడా పనిచేశారు. తీరా రాష్ట్రం విడిపోయాక కొంతకాలానికి తెలుగుదేశం పార్టీని వ్యతిరేకిస్తూ ఆయన వైసీపీలో చేరారు. జగన్ కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. ఆయనకు ముందుగా ఎమ్మెల్సీ ఇచ్చిన జగన్.. మంత్రిగా కూడా అవకాశం కల్పించి గౌరవించారు. ప్రస్తుతం మంత్రి పదవి లేకపోయినా కౌన్సిల్లో మెంబర్గా కొనసాగుతున్నారు. చాలా రాజకీయ అనుభవం ఉన్న ఆయన నిన్న మాట్లాడిన మాటలు అందరినీ విస్మానికి గురిచేశాయి.కూటమి సర్కార్ అధికారంలోకి రావడానికి అడ్డదారులు తొక్కిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Kaleshvaram : కాళేశ్వరం కేసీఆర్, హరీశ్ను కాపాడుతుందా? ఓడిస్తుందా?
ఎన్నికల సమయంలో కూటమి నేతలు ఈవీఎం మిషన్లు, బాక్సులను తారుమారు చేశారని.. దీనివెనుక కేంద్రం మద్దతు ఉన్నదని ఆరోపించారు. దీనికి తోడు అర్ధరాత్రివరకు ఓటింగ్కు ఈసీ ఎందుకు అనుమతి ఇచ్చిందని.. అక్కడే ఏదో మతలబు జరిగిందని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇలా మానిపులేషన్ చేయడం వల్లే కూటమి అధికారంలోకి వచ్చిందని విమర్శలు చేశారు. కాగా, బొత్స వ్యాఖ్యలు రాష్ట రాజకీయాల్లో కాకరేపాయి. ఆయన మానసిక స్థితి సరిగాలేదని మరికొందరు అంటున్నారు. ఏదేమైనా ఒక మంత్రిగా చేసిన అనుభవం ఉన్న కీలక నేత ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని కూటమినేతలు విమర్శిస్తున్నారు.జగన్ అధికారంలోకి వచ్చినప్పుడు రాని ఈవీఎం ట్యాంపరింగ్ తెలుగుదేశం పార్టీ గెలిస్తేనే జరిగిందా? అని నిలదీస్తున్నారు. ఇదిలాఉండగా, బొత్స సత్యనారాయణ కావాలని ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని, ఆ వ్యాఖ్యల వెనుకున్నది మాత్రం జగనే అని కూటమి నేతలు విమర్శిస్తున్నారు.